చంద్రబాబు కారణంగానే నిమ్మగడ్డ భ్రష్టు; బాబు కబంధ హస్తాల నుండి బయటకు రా : లక్ష్మీ పార్వతి సలహా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కారణంగా వ్యవస్థ భ్రష్టు పడుతుందంటూ తీవ్ర విమర్శలు చేశారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ బ్రతికున్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో మంచిగా ఉండే వారిని తనకు అతని గురించి బాగా తెలుసన్నారు లక్ష్మీపార్వతి. చంద్రబాబు వల్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా భ్రష్టు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
ఏపీలో నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ... కనిపించని ఏర్పాట్లు.. సర్వత్రా ఉత్కంఠ
నిమ్మగడ్డ చంద్రబాబు చేతిలో పావుగా మారటం బాధాకరం
ప్రజల కోసం మనమా ? లేక మన కోసం ప్రజలా ? అన్న పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు చేతిలో పావుగా మారడం అత్యంత బాధాకరమని, ఆవేదనకు గురి చేస్తోందని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. గతంలో ఎన్నో ఏళ్ల పాటు మంచి పేరు సంపాదించుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం తనకు ఉన్న మంచి పేరు మొత్తాన్ని పోగొట్టుకుంటున్నారు అని, ఇప్పటికైనా చంద్రబాబు కబంధహస్తాల నుంచి బయటకు రావాలని లక్ష్మీపార్వతి విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు అనుకున్నదే నిజం చెయ్యాలని చూస్తారు , ఆత్మవిమర్శ చేసుకోరు
నిమ్మగడ్డ తెలివితేటలు ఏమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, ఇప్పటికైనా మంచి వ్యవస్థకు నాంది పలకడానికి నిమ్మగడ్డ నిర్ణయాన్ని మార్చుకోవాలని పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నంత కాలం అవినీతి ,అక్రమాలు చేయటం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీచ రాజకీయాలకు పాల్పడటం చంద్రబాబు నైజం అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడూ ఆత్మవిమర్శ చేసుకోరని, ఆయన అనుకున్నది నిజం చేయాలని ప్రయత్నాలు చేస్తారని లక్ష్మీపార్వతి విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు వంటి వారిని దూరంగా ఉంచాలని బీజేపీకి విజ్ఞప్తి
చంద్రబాబు నీచ రాజకీయాలకు, క్షుద్ర రాజకీయాలకు నిదర్శనంగా దేవుళ్ళను కూడా రాజకీయాల్లోకి లాగారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఒకవైపు హిందువని చెబుతూనే మరోవైపు విగ్రహాలను ధ్వంసం చేయమని ఎవరైనా చెబుతారా అంటూ విగ్రహాల ధ్వంసానికి కారణం చంద్రబాబేనని లక్ష్మీపార్వతి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశం లౌకిక రాజ్యం అని, సర్వ మతాలు సమానమే అన్న లక్ష్మీపార్వతి, ఇటువంటి వ్యక్తులను బీజేపీ సైతం దూరంగా ఉంచటం మంచిదని, బిజెపి నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాం అని లక్ష్మీ పార్వతి తెలిపారు.
నిమ్మగడ్డకు హితవు పలికిన లక్ష్మీ పార్వతి
కుటుంబాల గురించి మీడియా వేదికగా విమర్శలు చేయడం తగదని లక్ష్మీపార్వతి హితవుపలికారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారాల గురించి రాసిన వారు చంద్రబాబు భువనేశ్వరి మాట్లాడుకోవడం లేదు, చంద్రబాబుకు భువనేశ్వరి భోజనం కూడా పెట్టడం లేదు అంటే దీనిని ఆయన ఎలా నిరూపించుకుంటారు అంటూ ప్రశ్నించారు. ఏ కుటుంబమైనా విమర్శించడం సరి కాదని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే కోవలో లక్ష్మీపార్వతి సైతం నిమ్మగడ్డ అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు అంటూ, చంద్రబాబు కబంధ హస్తాల నుండి బయట పడాలంటూ హితవు పలికారు.