భూములు కొన్నారు కాబట్టే భువనేశ్వరి సపోర్ట్ ... చంద్రబాబును నమ్మితే రైతులకు నష్టమే : లక్ష్మీ పార్వ
రాజధాని అమరావతిపై రగడ కొనసాగుతుంది . ఇక ఇప్పటికీ రాజధాని విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చేసింది . కానీ అమరావతి రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారన్న దానిపై మాత్రం ఇంకా సందిగ్ధత నెలకొంది. ఏపి క్యాపిటల్ సమస్యపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మి పార్వతి శనివారం స్పందించారు. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి దివంగత ఎన్.టి.ఆర్ కు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
జగన్ నిర్ణయంతో బాధ పడేది ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారే
మీడియాను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఒకటి లేదా రెండు రోజుల్లో ఏపి ప్రభుత్వం ఏపి క్యాపిటల్ సమస్యపై స్పష్టత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు . అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని ఆమె పేర్కొన్నారు. అమరావతి రైతులకు వైయస్ జగన్ న్యాయం చేస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్ముకుంటే రాజధాని రైతులకు నష్టం జరుగుతుందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. అమరావతిలో భూములిచ్చిన పేదరైతులకు న్యాయం జరుగుతుంది అని , ఇన్సైడర్ ట్రేడింగ్ లకు పాల్పడిన వారికి కాస్త బాధగానే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
రాజధాని పేరుతో టీడీపీ చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం
రాజధాని అమరావతి ప్రాంతం బహుళ అంతస్తుల భవనాలు కట్టటానికి అనుకూలంగా ఉండదని, మూడు పంటలు పండే భూములను తీసుకుని రాజధానిగా అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని , ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల అభివృద్ధికి దానిని విస్తరిస్తున్నారని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. రాయలసీమ బాగా వెనుక పడిన ప్రాంతం కాబట్టే అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసి అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్టు ఆమె చెప్పారు.
భువనేశ్వరిపై కామెంట్ చెయ్యను అంటూనే కామెంట్ చేసిన లక్ష్మీ పార్వతి
ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కోసం వందల ఎకరాల భూములు కొన్నారు కాబట్టే వాటిని కాపాడుకోవటం కోసం భువనేశ్వరి రాజధాని రైతుల పోరాటంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారని పేర్కొన్న లక్ష్మీ పార్వతి ఇక ఇంత కంటే భువనేశ్వరి విషయంలో తానేమీ కామెంట్ చెయ్యను అన్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వైజాగ్ కు ఉన్న అనుకూలతలు ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పిన లక్ష్మీ పార్వతి ప్రభుత్వం సమన్యాయం చేసేందుకు , అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన నేతలకే రాజధాని మార్పు నచ్చటం లేదని ఆమె పేర్కొన్నారు. ఏది ఏమైనా ఒకటిరెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని లక్ష్మీ పార్వతి చెప్పారు.