రాంగోపాల్ వర్మ తీసే లక్ష్మీస్ ఎన్టీఆరే... ఎన్టీఆర్ అసలైన బయోపిక్: లక్ష్మీ పార్వతి
విజయనగరం: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమానే ఎన్టీఆర్ అసలైన బయోపిక్ అని తేల్చేశారు ఎన్టీఆర్ సతీమణి, వైసిపి మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి.
విజయనగరంలో పర్యటిస్తున్న లక్ష్మీపార్వతి అక్కడ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు నాయుడు ఎలా లాక్కున్నారో ఈ సినిమా ద్వారా తెలుస్తోందని ఆమె చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో అసలైన వాస్తవాలు బయటకురావడం ఖాయమని లక్ష్మీ పార్వతి అంటున్నారు. టీడీపీ నేతలకు ఎన్టీఆర్ మాటలు వినాలంటే భయం పట్టుకుందని లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు.
రాంగోపాల్ వర్మ ఎలాంటి భయం లేకుండా ఎన్టీఆర్ ఎలా మరణించారో ప్రజలకు చూపిస్తారని తాను నమ్ముతున్నట్లు లక్ష్మీ పార్వతి తెలిపారు. చంద్రబాబు మోసానికి వ్యతిరేకంగా ప్రజలు వైఎస్ జగన్ మోహన్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని ఆమె అన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సుజయ్ కృష్ణ రంగారావు పార్టీ మారినా తమకేమీ చేయలేదని అక్కడి మహిళలే చీదరించుకుంటున్నారని ఆమె తెలిపారు.
రెండు రోజుల క్రితం లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మీ పార్వతి అక్కడ మీడియాతో మాట్లాడుతూ 22ఏళ్ల నా పోరాటానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దర్పణం పడుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి అక్కడ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక కీలక ప్రకటనను ట్వీట్ చేశారు.
''లక్ష్మీస్ ఎన్టీఆర్'కు కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారని... బాలకృష్ణ 'ఎన్టీఆర్'కు స్వరాలు సమకూరుస్తున్న ఎమ్.ఎమ్. కీరవాణి సోదరుడైన కల్యాణి మాలిక్ అనుకోకుండా మా సినిమా కోసం పనిచేస్తున్నారని చెప్పడం గమనార్హం. అయితే ఇది నిజంగా కాకతాళీయంగా జరిగిందని...ఉద్దేశ పూర్వకంగా ఆయన్ను ఈ ప్రాజెక్టుకు తీసుకోలేదని వర్మ ట్వీట్ చేశారు. దీంతోపాటు కల్యాణి మాలిక్తో కలిసి దిగిన ఫొటోను వర్మ షేర్ చేశారు.