లక్ష్మీపార్వతి మౌనదీక్ష: కలచివేస్తున్నాయంటూ!, లక్ష్మీస్ వీరగ్రంధం నిర్మాతకు హెచ్చరిక
కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను కలచివేశాయని, వాటి నుంచి ఉపశమనం కోసమే ఎన్టీఆర్ ఘాట్ వద్ద మౌన దీక్షకు దిగానని లక్ష్మీ పార్వతి చెప్పారు.
హైదరాబాద్: సినీ మార్కెట్కు ఎన్టీఆర్ ఇప్పుడో డిమాండ్ ఉన్న వస్తువైపోయారు. ఇన్నాళ్లు ఆయన జీవితం గురించి ఎవరికీ పట్టకపోయినా.. రాజకీయాల రీత్యానో, బిజినెస్ రీత్యానో.. ఇప్పుడాయన పేరుకున్న డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు చాలామంది రెడీ అయిపోతున్నారు.
Recommended Video
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జీవితం ఆధారంగా మూడు సినిమాలు వరుసగా తెరకెక్కబోతున్నాయి. ఎన్టీఆర్కు ఉన్న ఇమేజ్కు తోడు... లక్ష్మీ పార్వతితో ఆయన అనుబంధం, తదనంతర పరిణామాలే ఈ కథలన్నింటికీ కీలకంగా మారనున్నాయి.
కాబట్టి ఆన్ స్క్రీన్ లక్ష్మీపార్వతి-ఎన్టీఆర్ల కెమిస్ట్రీ, అలాగే రాజకీయంగా ఎన్టీఆర్పై లక్ష్మీ పార్వతి ప్రభావం వంటి అంశాలు ఈ సినిమాల పట్ల ఆసక్తిని మరింత పెంచాయి. అలాగే ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రను కూడా వీటిల్లో ఎలా చూపించబోతున్నారన్నది సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేస్తోంది.
లక్ష్మీస్ వీరగ్రంధంపై అభ్యంతరం:
బాలయ్య-తేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోను, రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలోను లక్ష్మీ పార్వతి ఇంతవరకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ ఇదే పరంపరలో లక్ష్మీస్ వీరగ్రంధం అంటూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే నిర్మాత మరో సినిమా ప్రకటించడం పట్ల మాత్రం ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర పరిణామాలుంటాయి:
తేజ, రాంగోపాల్ వర్మలు తెరకెక్కిస్తున్న చిత్రాలు ఎన్టీఆర్ జీవిత కథే ప్రధానాంశంగా తెరకెక్కే అవకాశాలు ఉండగా.. కేతిరెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంధం' లక్ష్మీ పార్వతి జీవిత చరిత్రపై ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. అందుకే లక్ష్మీ పార్వతి సైతం తన జీవితచరిత్రపై సినిమా తీయడం చట్ట విరుద్దం అంటున్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద మౌనదీక్షకు దిగిన ఆమె.. తన జీవిత చరిత్రపై సినిమా తీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సినిమాకు తన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించినవాళ్లెవరూ తనను సంప్రదించలేదని ఆమె చెబుతున్నారు.
మనశ్శాంతి కోసమే మౌనదీక్ష
కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను కలచివేశాయని, వాటి నుంచి ఉపశమనం కోసమే ఎన్టీఆర్ ఘాట్ వద్ద మౌన దీక్షకు దిగానని లక్ష్మీ పార్వతి చెప్పారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూర్చోవడం వల్ల తన మనసు కాస్త తేలికపడుతుందన్నారు. తన భర్తకు జరిగిన అన్యాయంపై ఎన్నో యేళ్లుగా తాను పోరాటం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. తన పోరాటానికి తప్పనిసరిగా భర్త తోడు ఉంటుందన్నారు. ఆయన ఆత్మ తనకు అండగా నిలుస్తుందన్నారు.
అంత ఉలుకెందుకు?:
ఓ వాస్తవ ఘటనను తాను తెరకెక్కించాలని భావిస్తుంటే, లక్ష్మీ పార్వతికి అంత ఉలుకెందుకని 'లక్ష్మీస్ వీరగ్రంధం' నిర్మాత కేతిరెడ్డి ప్రశ్నించారు. లక్ష్మీ పార్వతి తన సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
తాను లక్ష్మీ పార్వతినే ఒకటి ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నట్టు కేతిరెడ్డి చెప్పారు. 'తనకన్నా ముందు ఎన్టీఆర్ చరిత్రపై సినిమా తీస్తానన్న వాళ్లకు నువ్వు అభ్యంతరం చెప్పలేదు.. ఆ తర్వాత తీస్తానన్న రాంగోపాల్ వర్మకు అడ్డు చెప్పలేదు.
మధ్యలో నేను తీస్తానన్న సినిమాకు మాత్రం ఇంత ఉలికిపాటు ఎందుకు' అని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా అని నిలదీశారు. వీరగంధం సుబ్బారావు జీవిత కథను తీస్తానంటే ఆమెకుందుకు అభ్యంతరం అన్నారు. దీనిపై అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్లవచ్చునని సూచించారు.