ఎన్టీఆర్ను చంపైనా చేజిక్కించుకుంటారని చెప్పారు: బాబుపై లక్ష్మీపార్వతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి, దివంగత ఎన్టీ రామారావు సతీమణి తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ పార్టీ దొంగలంతా కలిసి ఘనంగా చేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
దేశ రాజకీయాల్లో చంద్రబాబును తిట్టనివారు లేరని, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావునే బయటకు గెంటేసిన హీన చరిత్ర చంద్రబాబుది అని ఆమె అన్నారు. హైదరాబాదులో పార్టీ కార్యాలయంలో ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ అలా అనుకోలేదు...
తన అల్లుడు చంద్రబాబు చేతిలోనే తాను మోసపోతానని ఎన్టీ రామారావు అనుకోలేదని లక్ష్మిపార్వతి అన్నారు. ఎన్టీఆర్ను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించినట్లు గతంలో చంద్రబాబే ప్రటించారని ఆమె గుర్తు చేశారు. అలాంటిది ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టుకుంటున్నారని, ఎన్టీఆర్ లేనిది వ్యవస్థాపక దినం ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు మీడియాను దిగజార్చారు
చంద్రబాబు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో చేరారని, నచ్చకపోతే బయటకు వెళ్లిపోవాలి గానీ వెన్నుపోటు పొడిచి మామ నుంచి పార్టీని లాగేసుకున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ ఆనందంగా లేరని, వైస్రాయ్ చెప్పుల దాడి సమయంలో విషయం బయటకు రాకుండా చంద్రబాబు మీడియాను దిగజార్చారని, ఇప్పుడు అవినీతికి పాల్పడుతూ అలాగే చేస్తున్నారని ఆమె విమర్శించారు.
శ్రీనివాసులు రెడ్డి అప్పుడే చెప్పారు...
నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నారావారికి ఎలా సొంతమవుతుందని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్ను చంపి అయినా చంద్రబాబు అధికారం చేజిక్కించుకుంటారని శ్రీనివాసులు రెడ్డి అప్పుడే చేప్పారని ఆమె గుర్తు చేశారు.
చంద్రబాబు సొంతంగా గెలిచారా...
ఎన్నికల్లో ఎప్పుడైనా చంద్రబాబు సొంతంగా గెలిచారా అని లక్ష్మిపార్వతి ప్రశ్నించారు. 1994 నుంచి 2004 వరకు జరిగన 40 ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు పరాజయం పాలయ్యారని ఆమె అన్నారు. తన బలహినతను కప్పిపుచ్చుకునేందుకు మీడియాలో ముందే చంద్రబాబు లీక్స్ ఇస్తారని అన్నారు.
చంద్రబాబును వారంతా తిట్టారు...
నువ్వు ప్రధానిని చేసిన దేవెగౌడ ఎన్నోసార్లు తిట్టారని, ఐకే గుజ్రాల్ తిట్టిన విషయం అందరీకి తెలుసునని ఆమె చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఎన్టీఆర్ బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభిపంజేసి ఆయన గుండెపోటుకు చంద్రబాబు కారణమయ్యారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ శవంతో కూడా రాజకీయం చేసి చంద్రబాబు ప్రయోజనం పొందారని అన్నారు.