చంద్రబాబు దోపిడీపై బీజేపీ ఎంక్వైరీ వేయాలి: లక్ష్మీపార్వతి, ‘కరుడుగట్టిన విలన్’
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు చేశారు. ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు మిత్రులుగా ఉన్నవారు.. ఆయనను ఇప్పుడు అసహ్యించుకుంటున్నారని అన్నారు.
చంద్రబాబు అవినీతిపై కేసు వేయాలి
‘నిన్నటి వరకూ బీజేపీలో ఉన్నారు. అదే బీజేపీ ఈరోజున ఆయనపై కారాలుమిరియాలు నూరుతోంది. ఈ కారాలు మిరియాలు ఇక్కడ నూరే బదులు చంద్రబాబు చేసిన అవినీతిపై ఓ కేసు వేయమని మేము అడుగుతున్నాం' అని లక్ష్మీపార్వతి తెలిపారు.
బాబు దోపిడీపై విచారణ చేపట్టాలి
‘బీజేపీకి ధైర్యం ఉంటే చంద్రబాబు చేసిన దోపిడీపై ఎంక్వైరీ వేయండి. దాంట్లో అతని పాపపు సొమ్ములు మొత్తం, బినామీ ఆస్తులు, ఇన్నేళ్లూ ఏపీ ప్రజలను లూఠీ చేసిన సొమ్ము బయటకొస్తుంది. సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం' అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
చంద్రబాబు దిగజారుడు ప్రచారం
ఇది ఇలా ఉండగా, మరో వైసీపీ నేత, వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎప్పటికప్పుడు భ్రమలు కల్పించి, పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటేనని దుయ్యబట్టారు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తూ చంద్రబాబు దిగజారుడు రాజకీయ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు కరుడుగట్టిన విలన్లా..
ప్రకాశం జిల్లాలో మంగళవారం జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. కరుడుగట్టిన విలన్లా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరి పోరేనని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ పెరిగిందని, కష్టపడితే విజయం తథ్యమని అన్నారు.