చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫైర్ ... బాబు అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్
వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏ మాత్రం అవకాశం ఉన్న చంద్రబాబును టార్గెట్ చేసి మాట్లాడే లక్ష్మీ పార్వతి తాజాగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు . ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ లక్ష్మీ పార్వతి బాబుపై నిప్పులు చెరిగారు.
చంద్రబాబుకు దమ్ము ధైర్యం, వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ ఎదుర్కో
నిరాధారమైన ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు ఉంటే చూపించండి అంటూ అధికార వైసీపీ నేతలు టిడిపి నేతలపై మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే, వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన అవినీతి అక్రమాలపై సి.బి.ఐ విచారణ కు సిద్ధంగా ఉండాలని ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి చంద్రబాబుకు సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన లక్ష్మీపార్వతి చంద్రబాబు అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని తను కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు.
ప్రధాని మోడీకి , కేంద్రరాష్ట్రప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు లేఖ రాస్తానన్న లక్ష్మీ పార్వతి
ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు చంద్రబాబుపై లేఖ రాస్తున్నట్లుగా ఆమె తెలిపారు. గతంలో తాను చంద్రబాబు అవినీతి అక్రమాలపై పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ ను 14 ఏళ్ల పాటు స్టే లతో బాబు అడ్డుకున్నారని ఆమె గుర్తు చేశారు . అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ విచారణ కావాలని టిడిపి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో లక్ష్మీపార్వతి చంద్రబాబు అవినీతి అక్రమాలపై కూడా సి.బి.ఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలవరం అవినీతిని ఎత్తి చూపిన మోడీ విచారణకు ఆదేశించాలని డిమాండ్
గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్ట్ ను అవినీతి మయం చేశారని పోలవరం ప్రాజెక్ట్ ని ఏటీఎం గా మార్చాలని, ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతి ని ఎత్తి చూపించారు. ఇప్పుడైనా అవినీతిపై విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీపై ఉందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.చంద్రబాబు అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలనే తన విజ్ఞప్తిని అంగీకరించాలని, ప్రధాని స్పందించి చంద్రబాబుపై విచారణకు ఆదేశించాలని ఆమె కోరుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలుంటే చూపించు అంటూ ఆగ్రహం
నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ప్రధానికి బాబు లేఖ ఎలా రాస్తారు అని ప్రశ్నించారు. ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశారో బాబు స్పష్టం చేయాలని, ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ముసుగులో చంద్రబాబు వ్యవస్థలను దోపిడీ చేస్తున్నారని విమర్శలు గుప్పించిన లక్ష్మీపార్వతి, చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు .