సిఆర్డిఏ పరిధిలో...ఆరు గ్రామాల్లో...భూసేకరణకు రెడీ
అమరావతి: సిఆర్డిఏ పరిధిలో మరో విడత భూ సేకరణకు రంగం సంసిద్దమైంది. రాజధాని నగర పరిధిలోని ఆరు గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియని గుంటూరు జిల్లా యంత్రాంగం ఒక కొలిక్కి తీసుకొచ్చింది. ఆయా గ్రామాలకు భూసేకరణలో చివరి అంకంగా పరిగణించే అవార్డుల జారీని ప్రకటించింది.
గతంలో నేలపాడు గ్రామానికి అవార్డు ప్రకటన పూర్తి కాగా తాజాగా అబ్బరాజుపాలెం, బోరుపాలెం, లింగాయపాలెం, రాయపూడి-1, రాయపూడి-2, శాకమూరు గ్రామాలకు అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులు ప్రకటించిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే మరికొద్ది రోజుల్లో మిగిలిన గ్రామాల అవార్డులను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు రైతులు ఈ ప్రక్రియపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భూ సమీకరణ మేలు:సిఆర్డీఎ
అయితే ఈలోపు రైతులు ముందుకొస్తే వారి భూములను భూ సమీకరణ పథకం కింద తీసుకొనేందుకు ఇంకా అవకాశం ఉందని సిఆర్డిఏ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రైతులకు భూ సేకరణ కంటే భూ సమీకరణ చాలా మేలని సిఆర్డిఎ వర్గాలు ఉద్భోధిస్తున్నాయి.
రెండున్నర రెట్లు...అధికం
భూసేకరణలో ప్రభుత్వం ఎకరానికి నిర్ణయించిన ధర కంటే భూ సమీకరణలో రెండున్నర రెట్లు అధికంగా వస్తుందని సిఆర్ డిఎ అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు అబ్బరాజుపాలెంలో ఎకరం భూమి రూ.8 లక్షలు కాగా దీనికి రెండున్నర రెట్లు కలిపితే కేవలం రూ.28 లక్షలు మాత్రమే రైతులకు వస్తాయని అంటున్నారు. అదే భూసమీకరణ కింద ఇస్తే ఎకరానికి వెయ్యి చదరపు గజాల నివాస, 250 చదరపు గజాల వాణిజ్య భూమిని సీఆర్డీఏ ఇస్తోందని వివరిస్తున్నారు.
Recommended Video
భూ సమీకరణకు...భూ సేకరణకు...తేడా ఉందంట...
ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో చదరపు గజం భూమి విలువ రూ.20 వేల వరకు ఉన్నట్లు అధికారవర్గాల అంచనా. దీనిని పరిగణనలోకి తీసుకొంటే ఎకరం భూమి ఎల్పీఎస్ కింద ఇస్తే ప్రస్తుతం ఉన్న ధరని లెక్కిస్తేనే సుమారు రూ.2.50 కోట్ల మేరకు లబ్ధి కలుగుతుందని అంటున్నారు. దీనితో పాటు ఏటా కౌలు రూ.30 వేలు...మళ్లీ ప్రతీ ఏటా 10 శాతం పెంపుతో ప్రభుత్వం ఆ కౌలు చెల్లిస్తుందని లెక్కలు చెబుతున్నారు. మరోవైపు ఇందుకు ప్రతిఫలంగా విద్య, వైద్యం, పక్కా ఇళ్లు, పెన్షన్లు, ఒకేసారి రుణమాఫీ వర్తింపు వంటి ప్రోత్సాహకాలు లభిస్తాయని వివరిస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో రైతులు అవార్డులు ప్రకటించే లోపు వస్తే వారి భూములను ఎల్పీఎస్ కింద తీసుకొనే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నాయి.
దిక్కుతోచని స్థితిలో...రైతులు...
అయితే రాజధాని పరిధిలోని కొందరు రైతులు భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల మీద భూసేకరణ చట్టాన్ని ప్రయోగించనున్నట్లు ఎపి ప్రభుత్వం గతంలోనే హైకోర్టుకు తెలిపిందని, ఆ మేరకు చేసుకుంటూ పోతున్నారని కొందరు రైతులు నిర్వేదం వ్యక్తం చేశారు. భూ సేకరణను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాల, ప్రజాసంఘాల నేతలు కూడా...భూ సమీకరణ కింద ఏవేవో ఇస్తామని అంటున్నారని, అవన్నీ ఇస్తారనడానికి ఎవరు హామీగా నిలబడతారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మీడియాలో కూడా కొన్ని వర్గాలు భూ సేకరణలోని మతలబులు చెప్పకుండా భూ సమీకరణ లాభమంటు ప్రలోభ పర్చేవిధంగా కథనాలతో ఊదరగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.