ఇదేం గోల..! రాజధాని భూముల్లో దొంగలు పడ్దారు
డిమాండ్ ఉన్నచోట వివాదం ఉండడం పరిపాటిగా మారిపోయింది. అసలు హక్కుదారుని పక్కకు నెట్టి, నాదంటే నాదన్న రీతిలో ఎడాపెడా కబ్జాలకు పాల్పడుతున్నారు కొంతమంది ప్రబుద్ధులు. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిలో పరిస్థితి ఇప్పుడు దొంగలు పడ్ద చందంగా తయారైంది. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని కాచుకు కూర్చుంటున్న కబ్జా రాయుళ్లు అమాయకులెవరైనా కంట్లో పడ్డమే ఆలస్యం వెంటనే అక్కడ వాలిపోతున్నారు.
ముఖ్యంగా ఎన్.ఆర్.ఐ లే టార్గెట్ గా కబ్జాలకు పాల్పడుతున్నాయి కొన్ని ముఠాలు. వీరికి అధికారులు, అధికార పార్టీ వ్యక్తుల అండదండలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బయటపడ్ద ఓ కబ్జా భాగోతంలో పోలీసులు ప్రదర్శించిన అలసత్వ వైఖరిని చూసి చాలామంది ఇదే రకమైన అభిప్రాయాలను వ్యక్డం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పెద్దకురవలపాడుకు చెందిన ఉన్నవ బుల్లయ్య చౌదరికి రాజధాని అమరావతిలో ఐదెకరాల 30 సెంట్ల భూమి ఉంది. నకిలీ పత్రాలను సృష్టించిన కొంతమంది కబ్జాదారులు ఆ భూమిలో పాగా వేశారు.
పోలీసులను ఆశ్రయిస్తే నిందితులను పట్టుకోవడానికి 8 నెలల సమయం పట్టిందని వాపోతున్నాడు బాధితుడు. రాజధానిలో కబ్జా కేసులు పెరిగిపోతున్న విషయాన్ని స్వయంగా ఎస్పీనే ఒప్పుకున్నారు. భూముల ధరలు ఆకాశన్నంటడం దీనికొక కారణమైతే.. అధికారులు, పార్టీ పెద్దల పేర్ల చెప్పి దందాలకు పాల్పడుతున్నవారు కూడా ఎక్కువైపోతున్నారు. అనిల్ కుమార్ అనే ఓ వ్యక్తి టీడీపీ నేతల పేర్లు చెప్పి చేస్తున్న దందా భాగోతాన్ని పోలీసులు ఇటీవలే బయటపెట్టారు. ఏదేమైనా రాజధానిలో భూములకు రక్షణ లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.