తెరపైకి రాజధాని భూబాగోతం: టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్'కు బ్రేక్ వేసేందుకేనా?
అమరావతి: ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. 'ఆపరేషన్ ఆకర్ష్' తో టీడీపీ వలసలకు తెరలేపడంతో ఆ వలసలను ఎలా ఆపాలో తెలియక ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సతమతమయ్యారు. అయితే ఈ క్రమంలో వైయస్ జగన్కు చెందిన మీడియా సాక్షిలో రాజధాని భూబాగోతాలంటూ కొత్త కొత్త కథనాలను ప్రచురించింది.
ఈ కథనాలతో అధికార పార్టీలో ఒకింత భయం పట్టుకుంది. సాక్ష్యాలు, భూ పత్రాలతో సహా సాక్షి మీడియా వరుస కథనాలను ప్రచురించడంతో మంత్రులకు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతేకాదు తమపై వస్తున్న ఆరోపణలు ఎలా ఖండించాలో తెలియక తడబడుతున్నారు.
కాగా ఏపీ ప్రభుత్వంలోని కొందరు మంత్రులపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై సాక్షాత్తూ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. బుధవారం విజయవాడలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో రాష్ర్టంలో తాజా రాజకీయ పరిణామాలను అవగాహన చేసుకుని వాటిపై వెంటనే స్పందించటంలో మంత్రులు విఫలమౌతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అంతేకాదు జగన్ మీడియా సాక్షి ఏయే మంత్రులపై ఆరోపణలు చేసిందో ఆయన మంత్రులు ‘సాక్షి' మీద కేసులు వేయాలని, తమ అనుకూల పత్రికల్లో పెద్దగా ప్రచారం చేయించి అసలు విషయాన్ని పక్కదారి పట్టిద్దామనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించి మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు, లోకేశ్, మంత్రులు న్యాయ విభాగం అధికారులతో చర్చించారని తెలుస్తోంది.
అంతేకాదు సీఆర్డీఏ అధికారులను పిలిపించుకుని రాజధాని ప్రాంతంలో జరిగే వ్యవహారాలకు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లు బయటకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారని సమాచారం. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ భూదందాను మరో కోణంలో చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ ప్రకటించడంతో వైసీపీ ఎమ్మెల్యేలను 'ఆపరేషన్ ఆకర్ష్'తో టీడీపీలోకి ఆహ్వానించడం మొదలుపెట్టారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం, దానిని అడ్డుకునేందుకు రాజధానిలో టీడీపీ నేతల భూబాగోతాలను బయట పెట్టారని అంటున్నారు. తాజాగా గురువారం నాడు కూడా సాక్షిలో రాజధాని భూబాగోతాలలో చాలా మంది తెదేపా నేతల పేర్లను బయటపెట్టింది. ఈరోజు జాబితాలో మంత్రి నారాయణ (3,129), ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ (4.09), స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు (17.3) ఎకరాల భూమిని, ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర రూ.5కోట్లు విలువయిన పోరంబోకు భూమిని తమ బినామీల పేరిట కొన్నట్లు పేర్కొంది.
అయితే ఆ బినామీలు ఎవరెవరి వద్ద నుంచి ఎంతెంత విస్తీర్ణం ఉన్న భూమిని కొనుగోలు చేసారో కూడా పేర్కొంది. ఈ భూబాగోతంలో ప్రధాన పాత్ర పోషించింది మంత్రి నారాయణేనని సాక్షి పేర్కొంది. వైసీపీ తరుపున సాక్షి మీడియా చేస్తున్న ఈ ఆరోపణలను ఎవరెవరు ఏయే సమాధానం చెప్తారో చూడాలి.
మరికొందరు మంత్రులు మాత్రం సాక్షిలో వచ్చిన కథనంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుదామని ఒక మంత్రి ప్రతిపాదించగా, భూములు కొన్న మంత్రులు మాత్రం అందుకు సుముఖంగా లేరని, ఒకవేళ సవాల్ విసిరితే వైసీపీ నేతలు ఆధారాలతో చూపిస్తే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అంటున్నారు.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ కూడా హాజరైన సమావేశంలో ఎవరెవరు ఎన్ని భూములు కొన్నారన్న అంశం చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో కొందరు మంత్రులు భూములు కొన్నమాట నిజమేనని లోకేశ్ ముందు ఒప్పుకున్నారని సమాచారం. అంతేకాదు సాక్షి మీడియా రాజధాని భూబాగోతంపై కథనాలు ప్రచురించడానికి గాను గ్రౌండ్ వర్క్ బాగానే చేసిందని వైసీపీ నేతలు అంటున్నారు.
టీడీపీ నేతలు రాజధానిలో బినామీల పేరిట భూములను కొనుగోలు చేశారని చెప్పడానికి తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టే ఇంత ధైర్యంగా ఆరోపణలు చేయగలుతున్నామని అంటున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఫిరాయింపులను ఆపేందుకే వైసీపీ ఈ కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చిందని అంటున్నారు.