గుంటూరులో భూముల విలువ తగ్గడానికి జగనే కారణం: పత్తిపాటి
అమరావతి: గుంటూరు జిల్లాలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర కారణంగా రాజధాని రైతుల భూముల విలువ దారుణంగా పడిపోయిందని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.
అమరావతిలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. గంటూరు జిల్లాలో వైఎస్ జగన్ నిర్వహించిన పాదయాత్ర కారణంగా గుంటూరు జిల్లాలో భూముల విలువ గజానికి రూ.2 నుండి రూ3 వేలకు తగ్గిపోయాయని ఆయన చెప్పారు.
గుంటూరు జిల్లాలోని సీఆర్ కాలేజీ మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను మంత్రి పుల్లారావు ఇవాళ ఆవిష్కరించారు.ఈ జాబ్ మేళా ఏప్రిల్ 21వ తేదిన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
అమరావతిపై విమర్శలు గుప్పించిన జగన్ తీరును మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. అమరావతిని భ్రమరావతిగా పోల్చాడని ఆయన గుర్తు చేశారు. అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు కన్పించలేదా అని మంత్రి పుల్లారావు జగన్ను ప్రశ్నించారు. అమరావతికి జగన్ అనుకూలమా, వ్యతిరేకమా అనే విషయమైసమాధానం చెప్పాలని మంత్రి పుల్లారావు ప్రశ్నించారు.
ఏపీ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హమీని నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. ఏపీకి ఇచ్చిన హమీని నెరవేర్చాలనే డిమాండ్తో ఏప్రిల్ 20వ తేదిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దీక్షకు దిగుతున్నారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడును బలహీనపర్చడం సరికాదని ఆయన విపక్షాలకు సూచించారు.
ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసినా ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోరాటాలు, నిరసన కార్యక్రమాలు ఉండాలని మంత్రి పుల్లారావు ఆందోళనకారులకు సూచించారు. ప్రధానమంత్రి మోడీ ఇంటి ముందు వైసీపీ నేతలు ధర్నా చేయాలని ఆయన వైసీపీ నేతలకు సూచించారు.