అయ్యో పాపం: స్కూలుకెళ్లిన చిన్నారి లక్ష్మిని చంపేసిన వీధి కుక్కలు
కర్నూలు: అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా వెంగళంపల్లి గ్రామం. అక్కడ ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. అందులో 60 మంది పిల్లలుంటారు. ఆ స్కూళ్లో హెడ్మాస్టర్తో కలిపి ఇద్దరు టీచర్లు మాత్రమే ఉంటారు. దీనికి హెడ్మాస్టర్ సయ్యద్ అబ్దుల్ లతీఫ్ ఖాన్. స్కూలులో సరైన ఇన్ఫ్రా స్ట్రక్చర్ లేదు అదేసమయంలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేరు. ఇక ఆ స్కూలులో హాజరు పట్టిక పరిశీలిస్తే విద్యార్థులు హాజరు చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా వందశాతం హాజరు నమోదైంది. ఇదంతా లక్ష్మీ వల్లే జరిగింది..? ఇంతకీ ఎవరా లక్ష్మీ..? ఏంటా స్టోరీ..?
లక్ష్మీ రాకతో స్కూలులో పెరిగిన హాజరు శాతం
వెంగళంపల్లి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చాలామంది క్లాసులు ఎగ్గొడతారు. కానీ ఒక విద్యార్థి మాత్రం కచ్చితంగా క్రమం తప్పకుండా క్లాసుకు హాజరవుతుంది. ఆ విద్యార్థి పూరు లక్ష్మీ. మామూలు లక్ష్మీ కాదు లంగూర్ లక్ష్మీ. లక్ష్మీ అమ్మాయి అనుకుంటే పొరపాటే. లక్ష్మీ ఒక కోతి. ఈ కోతికి లక్ష్మీ అనే పేరును అక్కడి విద్యార్థులే పెట్టారు. క్లాసుకు వస్తుంది. పిల్లలతో పాటు కూర్చుంటుంది. పుస్తకాలను తిరిగేస్తుంది. లంచ్ బ్రేక్లో పిల్లలతో పాటే భోజనంకు కూర్చుంటుంది. ఇక స్కూలులో లంగూర్ లక్ష్మీ ఒక స్టార్గా అయ్యింది.ఇక లక్ష్మీ వస్తుందంటే చాలు.. స్కూలు ఎగ్గొట్టాలన్న ఆలోచన ఉన్న పిల్లలు దీనికోసం క్లాసులకు హాజరై పాఠాలను శ్రద్ధగా వింటారు. దీంతో అరకొరగా ఉండే విద్యార్థుల హాజరు 100శాతంకు చేరుకుంది.
శనివారం వీధికుక్కల దాడిలో మృతి చెందిన లంగూర్ లక్ష్మీ
ఇక శనివారం ఎప్పటిలాగే విద్యార్థులు క్లాసుకు వెళ్లారు. లక్ష్మీ కూడా వచ్చింది. పాఠాలు శ్రద్దగా విన్నారు. ఇక భోజన విరామంకు గంట కొట్టడంతో లంగూర్ లక్ష్మీ స్కూలు కాంపౌండ్ దాటి బయటకు వెళ్లింది. ఇక తిరిగి గంట మోగగానే విద్యార్థులంతా తరగతి గదికి చేరుకున్నారు. కానీ వారి ప్రియనేస్తం లంగూర్ లక్ష్మీ క్లాసుకు రాలేదు. దీంత వారంతా ఒక్కింత నిరాశకు గురయ్యారు. ఏం జరింగిందని ఆరా తీశారు. అంతలోనే వారికి విషాదకరమైన వార్త అందింది. లక్ష్మీని ఆ గ్రామంలోని వీధికుక్కలు చంపేశాయని తెలియడంతో ఒక్కసారిగా విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
జూలై నెల నుంచి క్లాసులకు హాజరు అవుతున్న లంగూర్ లక్ష్మీ
సాధారణంగా లక్ష్మీ లంచ్ బ్రేక్లో బయటకు వెళ్లదని విద్యార్థులు తీసుకొచ్చే అరటి పండ్లు తింటుందని కానీ శనివారం మాత్రం ఎలాగో బయటకు వెళ్లి వీధికుక్కల బారిన పడిందని హెడ్మాస్టర్ లతీఫ్ చెప్పారు. ఈ లంగూర్ ప్యాపిలీ సమీపంలోని అడవుల్లో నుంచి వచ్చిందని హెడ్మాస్టర్ చెప్పారు. ఈ ఏడాది జూలైలో స్కూలు కాంపౌండ్లోకి అడుగుపెట్టిన లంగూర్.. అందరికీ చాలా దగ్గరైందని చెప్పారు. ఉదయం ప్రార్థన జరిగే సమయం నుంచి క్లాసులు హాజరుకావడం, పుస్తకాలు తిరిగేయడం వరకు అన్నీ చేసేదని హెడ్మాస్టర్ గుర్తు చేశారు. అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగజేసేది కాదని చెప్పారు. విద్యార్థులకు ఏదైనా హానీ కలిగిస్తుందేమో అని చెప్పి దాన్ని బయటకు పంపే ప్రయత్నం చేసినవారు తర్వాత వారి ఆలోచనను మార్చుకున్నారు.
లక్ష్మీకి సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు
లక్ష్మీతో తమకు మంచి అనుబంధం ఉందని విద్యార్థులు గుర్తుచేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి వచ్చి ఆ లంగూర్ లక్ష్మీని పెంచుకుంటానని తీసుకెళ్లాడని అయితే నాలుగు రోజులకే అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి తమ వద్దకు వచ్చినట్లు విద్యార్థులు చెప్పారు. అలాంటి అనుబంధం తమందరితో లక్ష్మీ ఏర్పరుచుకుందని లతీఫ్ చెప్పారు.ఇక లక్ష్మీ మృతి చెందడంతో శనివారం మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు. లక్ష్మీ మృతి తమనెంతో కలచివేసిందని స్కూలు సిబ్బంది తెలిపింది. అందుకే గ్రామం బయటకు తన మృతదేహాన్ని తీసుకెళ్లి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించామని హెడ్మాస్టర్ లతీఫ్ చెప్పారు.