లోకేష్ సీఎం కావాలని క్షుద్రపూజలు చేస్తే ప్రశ్నించారా ? డిక్లరేషన్ కోసం ఎందుకింత: లక్ష్మీ పార్వతి
ఏపీలో తిరుమల డిక్లరేషన్ రగడ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. తిరుమల డిక్లరేషన్ విషయంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తాజా ఆరోపణలపై తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు.
చంద్రబాబు, లోకేష్ , భువనేశ్వరిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు .డిక్లరేషన్ పేరుతో అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని, ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బురద జల్లుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్లంతా పని పాట లేని వాళ్ళని నిప్పులు చెరిగారు. ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు .
చంద్రబాబుది కాంగ్రెస్ కల్చర్ .. అందుకే మత ఘర్షణలకు యత్నం
గతంలో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి సీటు నుండి కిందకు దించేందుకు కాంగ్రెస్ పార్టీ పాతబస్తీలో మత ఘర్షణలు సృష్టించిందని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. 1989 - 94 మధ్యలో మత ఘర్షణలు జరిగాయని, కాంగ్రెస్ కల్చర్ అదని చెప్పిన లక్ష్మీ పార్వతి కాంగ్రెస్ నుండి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ఏపీలో మత ఘర్షణలకు కారణమవుతున్నాడు అంటూ మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో టిడిపి, బిజెపి నేతలు కావాలని ఉద్రిక్తత సృష్టిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు లక్ష్మీపార్వతి. టీడీపీ నేతలలానే, బిజెపి నేతలు కూడా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారంటూ లక్ష్మీపార్వతి విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి హోదాలో డిక్లరేషన్ వర్తిస్తుందా ?
చంద్రబాబుకు హిందూ మతం పట్ల విశ్వాసం ఉంటే ప్రజల ముందు నిరూపించాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి డిక్లరేషన్ వర్తిస్తుందా అని ఆమె ప్రశ్నించారు. హిందూ సంప్రదాయాన్ని చంద్రబాబు ఎప్పుడు పాటించారో చెప్పాలని నిలదీశారు. సోనియాగాంధీ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారా అంటూ ప్రశ్నించారు. హిందుత్వం అనేది ఒక మతం కాదని, ఒక ధర్మమనీ పేర్కొన్న లక్ష్మీపార్వతి మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
లోకేష్ ను సీఎం చెయ్యటం కోసం భువనేశ్వరి క్షుద్ర పూజలు .. ప్రశ్నించారా ?
నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం భువనేశ్వరి క్షుద్రపూజలు చేసిందంటూ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కోసం భువనేశ్వరి చేసిన క్షుద్రపూజల గురించి బిజెపి నేతలు వారిని ప్రశ్నించారా అని నిలదీశారు. గతంలో సీఎం జగన్ తిరుమలకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ కోసం ప్రశ్నించని వారు, ఇప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారు అంటూ మండిపడ్డారు. రాజు విష్ణువుతో సమానమని పురాణాలు చెబుతున్నాయని, ముఖ్యమంత్రికి రాష్ట్రంపై సర్వ హక్కులు ఉంటాయని, జగన్ ఎప్పుడో హిందువుగా మారారు అంటూ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
డిక్లరేషన్ పై బహిరంగ చర్చకు సిద్ధం అన్న లక్ష్మీ పార్వతి
డిక్లరేషన్ పై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్న లక్ష్మీపార్వతి హిందూ సాంప్రదాయాల మీద, పురాణాల మీద తనకు అవగాహన ఉందని చెప్పారు. అన్ని మతాలను గౌరవిస్తానని అన్ని గ్రంథాలను చదివానని పేర్కొన్న లక్ష్మీపార్వతి సమాజానికి కావలసింది మతం, కులం కాదంటూ పేర్కొన్నారు. గతంలో స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డిని గంగానదిలో పూజలు చేయించి హిందువుగా మార్చారని, అయినప్పటికీ కొందరు స్వామీజీలు కాషాయం ధరించి మరీ రాజకీయాలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి భగ్గుమన్నారు.
Recommended Video
వాస్తవాలు మాట్లాడాలని లక్ష్మీ పార్వతి క్లాస్
బీజేపీ, టీడీపీ నేతలు డిక్లరేషన్ గురించి వాస్తవాలు మాట్లాడాలని పేర్కొన్న లక్ష్మీపార్వతి కరీం దాసు, బీబీనాంచారి ఎవరో స్వామీజీలకు తెలియదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించాలన్న వైఖరిని ప్రతిపక్ష పార్టీలు మార్చుకుంటే మంచిది అంటూ హితవు పలికారు తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి. తాజా పరిణామాల నేపధ్యంలో టీడీపీ , బీజేపీ నాయకులకు లక్ష్మీ పార్వతి తనదైన స్టైల్ లో క్లాస్ తీసుకున్నారు .