ప్రభుత్వ లాంఛనాలతో మూర్తి అంతిమ సంస్కారాలు;ఆయన వల్లే గెలుపు:బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
విశాఖపట్టణం: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టీడీపీ శాసనమండలి సభ్యుడు, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి పార్థివదేహానికి నేడు కన్నీటి వీడ్కోలు పలకనున్నారు.
ఆదివారం ఉదయం విశాఖలోని స్వగృహానికి చేరుకున్న మూర్తి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతాయని ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మూర్తి భౌతికకాయానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నివాళులర్పిస్తారని అన్నారు. గీతం యూనివర్సిటీ వద్ద మూర్తి పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మూర్తి పార్థివదేహం...విశాఖ చేరిక
అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయం ఆదివారం ఉదయం విశాఖలోని ఆయన స్వగృహానికి చేరుకుంది. మధ్యాహ్నం 2గంటల వరకు మూర్తి స్వగృహంలో ఆయన భౌతికకాయం ఉంచి అనంతరం మ.2 గంటల నుంచి 2.45వరకు ఎన్టీఆర్ భవన్లో ఉంచనున్నారు. ఆ తరువాత రుషికొండలోని మూర్తి విద్యా మానస పుత్రిక గీతం యూనివర్సిటీ వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే రుషికొండ స్మృతివనంలో ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
నా గురువు...అయ్యన్న పాత్రుడు
విశాఖలోని స్వగృహంలో ఉంచిన మూర్తి భౌతికకాయాన్ని సందర్శించేందుకు ప్రజాప్రతినిథులు, విద్యాప్రముఖులు, విఐపిలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈక్రమంలో మూర్తి పార్థివదేహాన్ని సందర్శించిన మంత్రి అయ్యన్నపాత్రుడు పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు చాలా దురదృష్టకరమని...తన గురువు ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణ వార్త విన్నవెంటనే ఒక పెద్ద దిక్కు పోయిందనే భావన నెలకొందని అన్నారు. తమ కుటుంబసభ్యుల్లో ఒకరు పోతే ఎంత బాధపడతామో...అంతకంటే మూర్తి మరణం తనకు చాలా ఎక్కువ బాధకలిగిస్తోందని చెప్పారు.
గెలిచింది...మూర్తి వల్లే
మూర్తి పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించిన బిజెపి నేత విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ మూర్తి గారు లేని లోటు తనకు తీరనిలోటని అన్నారు. టీడీపీకే కాదు...ఆయన మృతి బీజేపీకి కూడ తీరనిలోటని అన్నారు. తాను 2014 ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయనే దగ్గరుండి అందరినీ సమన్వయం చేసి, ముందుండి తనను గెలిపించారని అన్నారు. తన గెలుపుకు ఆయనే కారణమని...అలాగే ఇక్కడ ఇతర బీజేపీ సభ్యులను కూడా ఆయనే గెలిపించారని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఎంతో చిత్తశుద్దితో చేసే మనస్తత్వం ఆయనదని ప్రస్తుతించారు. అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా భాధాకరమైన విషయమని, ఇది విశాఖకు బ్లాక్ సండే అని విష్ణుకుమార్ రాజు అభివర్ణించారు.
పెద్ద దిక్కు...కోల్పోయాం
మూర్తి భౌతిక కాయంపై ప్రముఖ విద్యావేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పుష్పగుచ్చములిచ్చి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖ పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు. ఎంతోమందికి విద్యాదానం చేసిన మహావేత్త మూర్తి అని యార్లగడ్డ కొనియాడారు. మూర్తి భౌతిక కాయనికి నివాళి అర్పించిన ఎంపి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ మూర్తి మృతి చాలా బాధాకరమని...ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. వ్యాపార, విద్యా, రాజకీయ వేత్తగా ఎన్నో రంగాల్లో రాణించిన వ్యక్తి అని కొనియాడారు. ముఖ్యంగా ఆయన మానవతావాది అని, అలాంటి వ్యక్తి మనమధ్య లేకపోవడం ముఖ్యంగా టీడీపీకి తీరని నష్టమని చెప్పారు..