దేశంలోనే అత్యధికంగా తెలంగాణాను వణికిస్తున్న ఆ కేసులు..హైదరాబాద్ లోనే ఎక్కువ బాధితులు
ఒకప్పుడు దేశాన్నంతా వణికించిన హెచ్ఐవి మహమ్మారి ప్రస్తుతం కాస్త తగ్గినట్టు కనిపించినా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పంజా విసురుతుంది. దేశంలోనే అత్యధికంగా ఈ ఏడాది హెచ్ఐవి కేసులు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది అని చెప్పక తప్పని పరిస్థితి. రేపు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం,ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో నమోదైన హెచ్ఐవి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వెలువరించిన లెక్కల ప్రకారం దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ లో హెచ్ఐవి పాజిటివ్ బాధితులు ఉన్నారని తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో 83,102 మంది హెచ్ఐవీ బాధితులు.. తాజా గణాంకాల వెల్లడి
హెచ్ఐవి మహమ్మారి తెలంగాణ రాష్ట్రాన్ని గజ గజా వణికిస్తూ నే ఉంది. 2017 లెక్కల ప్రకారం ఆ ఒక్క సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో నమోదైన హెచ్ఐవి కేసులు 9324 కేసులు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు హెచ్ఐవి పాజిటివ్ బాధితులకు అడ్డాగా మారింది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో 83,102 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాజా గణాంకాలను ప్రకటించింది. డిసెంబర్ 1న ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా తాజా గణాంకాలను వెలువరించిన టీ సాక్స్ దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ లో కేసులు నమోదు అవుతున్నట్లుగా పేర్కొంది.
అత్యధికంగా హైదరాబాద్లో హెచ్ఐవీ బాధితులు ..కరీంనగర్, నల్గొండలు రెండు మూడు స్థానాలు
ఒకప్పుడు ఎయిడ్స్ సోకింది అంటే భయపడేవారు. ఆ వ్యక్తిని సైతం ముట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదు.ఎయిడ్స్ రావడం అంటే మరణం తప్పదనే అభిప్రాయం ఉండేది. క్రమేణా దేశంలో అలా ఆలోచించే వారి సంఖ్య తగ్గుతున్నా, ఎయిడ్స్ మహమ్మారి మాత్రమే చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రంలో మాత్రం హెచ్ఐవి బాధితులు పెరుగుతున్నారుతెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ లో ఈసంఖ్య ఎక్కువగా ఉందని, కరీంనగర్, నల్గొండలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది ఎయిడ్స్ నియంత్రణ సంస్థ . ప్రస్తుతం ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న అంశం.
తెలుగు రాష్టాలను వణికిస్తున్న ఎయిడ్స్ .. చాపకింద నీరులా విస్తరిస్తున్న హెచ్ఐవీ
అతి భయంకరమైన వ్యాధిగా పరిగణించిన ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం ఎయిడ్స్ నియంత్రణ మండలి తీవ్రంగా కృషి చేస్తుంది . ఇప్పటివరకు ఎయిడ్స్ బారిన పడిన వారికి ఉపశమనానికి మందులు మినహాయించి, వ్యాధి పూర్తి నివారణకు మందులు కనిపెట్టలేదు. నేటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు ప్రభుత్వ ఎంత ప్రచారం చేసినా, వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలని ఎన్ని రకాల సూచనలు చేసినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాపకింద నీరులా ఎయిడ్స్ ప్రబలుతోంది. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎయిడ్స్ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇటీవల జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ఇచ్చిన లెక్కలు సైతం ఏపీ, తెలంగాణా రాష్ట్రాలను వణికిస్తున్నాయి.