శాంతి భద్రతల పర్యవేక్షణే ముఖ్యం, గతంలో జగన్ను అరెస్ట్ చేయలేదా: స్పీకర్ తమ్మినేని
ఏపీలో రాజధాని మార్పుపై ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్నాయి. మరోవైపు నేతల మధ్య మాటల కోటలు దాటుతున్నాయి. రాజధాని మార్పుపై వ్యతిరేకంగా విపక్ష టీడీపీ, అనుకూలంగా వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాలని టీడీపీ నేత బోండా ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం విరుచుకుపడ్డారు.
ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు సభ్యత మరిచారని స్పీకర్ తమ్మినేని సీతారాం విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలను అరెస్ట్ చేయలేదా అని ప్రశ్నించారు. మీరు చేస్తే కరెక్ట్.. మేం చేస్తే తప్పా అని అడిగారు. విశాఖపట్టణం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నిలిపివేయలేదా అని ప్రశ్నించారు.
నిరసనకు దిగే సమయంలో శాంతి భద్రతల గురించి చంద్రబాబు ఆలోచించాలని సూచించారు. 14 ఏళ్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా అనుభవం ఉంది కదా అని అడిగారు. అలా కాకుండా ఇస్టానుసారం వెళ్తామంటే కుదరదని తేల్చిచెప్పారు. పోలీసులు చట్టం ప్రకారం నడుచుకుంటారని, శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.