హోమ్ మంత్రికి పోలీసుల గౌరవ వందనం: సుచరితతో డీజీపీ భేటీ!
గుంటూరు: విభజన తరువాత ఏర్పాటైన రాష్ట్రానికి తొలి మహిళా హోమ్శాఖ మంత్రిగా నియమితులైన తరువాత తొలిసారిగా మేకతోటి సుచరిత గుంటూరు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా అర్బన్ ఎస్పీ రామకృష్ణ సహా పలువురు ఉన్నతాధికారులు ఆమెతో భేటీ అయ్యారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసుల నుంచి ఆమె గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ వెంటనే ఆమె రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై సమీక్ష చేపట్టారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, రాజకీయ పరమైన దాడులను ఉపేక్షించేది లేదని చెప్పారు. సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు దాడులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హింసకు పాల్పడటం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడాన్ని అదుపు చేయాలని ఆమె సూచించారు.
పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇందులో భాగంగా- పని గంటలను తగ్గించడానికి ఇప్పటికే కసరత్తు ఆరంభమైందని అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్లను ఇచ్చే వ్యవస్థను ప్రవేశపెడతామని తాము ఇదివరకే ప్రకటించామని, ఈ దిశగా త్వరలోనే ఉత్తర్వులు వెలువరిస్తామని సుచరిత తెలిపారు.