పెట్రోల్ బంక్ సమ్మె: చుక్కలు చూపిన గవర్నర్, కిరణ్కూ
తూనికలు, కొలతల శాఖ అధికారులు తమను వేధిస్తున్నారంటూ పెట్రోలు బంకు యజమానులు సమ్మెకు దిగారు. పలు పెట్రోలు పంపుల్లో ప్రత్యేకమైన చిప్లు, పరికరాలు ఉపయోగించి మోసం చేస్తున్నట్లు రుజువైంది. ప్రతి వంద లీటర్లకు 6 నుంచి 8 లీటర్లు నొక్కేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సోదాలు మొదలుపెట్టారు. ఈ దెబ్బకు పెట్రోలు బంకుల యజమానులు విలవిల్లాడిపోయారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని బంకుల యజమానులు ఆదివారం ఒక్కసారిగా సమ్మెకు దిగారు. సామాన్యులకు చుక్కలు చూపించారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ రంగంలోకి దిగారు. సత్వరం సమస్యను పరిష్కరించాలని సిఎఎస్ను ఆదేశించారు. ఆపై పెట్రోలు డీలర్ల సంఘం ప్రతినిధులను తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ గోపాల్ రెడ్డి చర్చలకు పిలిచారు. సమ్మెపై గవర్నర్ సీరియస్గా ఉన్నట్లు సంకేతాలు పంపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తక్షణం సమ్మె విరమించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో తమ వైపు నుంచి ఉన్న పొరపాట్లు దిద్దుకునేందుకు మూడునెలల సమయం ఇవ్వాలని సంఘం ప్రతినిధులు కోరారు. రిమోట్ కంట్రోల్, ఇతర పరికరాలను వెనక్కి ఇచ్చేస్తామని లిఖితపూర్వకంగా అంగీకరించారు. వెంటనే సమ్మెను కూడా విరమించారు. గవర్నర్ చర్యల కారణంగా గంటలోపే సమ్మె విరమించారు. వాహనదారుల కష్టాలు గట్టెక్కాయి. కాగా, సాధారణ పరిపాలనలో అయితే సమస్య పరిష్కారానికి కనీసం వారం రోజులు పడుతుంది. రాష్ట్రపతి పాలన కావడంతో గంటలోనే విషయం కొలిక్కి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపించాయి.
కిరణ్కూ ఝలక్
గవర్నర్ కోటా శాసన మండలి సభ్యుల నియామకంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నరసింహన్ మరో ఝలక్ ఇచ్చారు. తాను అనుకున్నట్లుగానే ఎమ్మెల్సీలుగా కంతేటి సత్యనారాయణ రాజు, నంది ఎల్లయ్య, రత్నాబాయి పేర్లను మాత్రమే ఆమోదించారు. ఈ ముగ్గురితోపాటు రఘురామి రెడ్డి పేరును కూడా సిఎం హోదాలో కిరణ్ అప్పుడు ప్రతిపాదించారు. వీరిలో రఘురామి రెడ్డి పేరుకు గవర్నర్ 'నో' చెప్పారు.