హలో ఎక్స్యూజ్ మీ.. వైసీపి గెలిచిన దగ్గరనుంచీ ఆవిడ మిస్సింగ్..! కనిపిస్తే చెప్తారా బాబూ..!!
అమరావతి/హైదరాబాద్ : తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు అసలు సిసలు వారసురాలిని తానేనంటూ చెప్పుకు తిరుగుతున్న ఆయన సతీమణి లక్ష్మీపార్వతి వ్యవహార సరళి ఇప్పుడు నిజంగానే పెను వివాదంలో పడిపోయింది. తన భర్త స్థాపించిన టీడీపీ పార్టీ ఇంకా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నా... లక్ష్మీపార్వతి మాత్రం ఆ పార్టీకి వైరివర్గంగా ఉన్న వైసీపీలో కొనసాగుతున్నారు.
అంతేనా... టీడీపీ అధినేతగా ఉన్న నారా చంద్రబాబునాయుడిపై అవకాశం చిక్కినప్పుడల్లా తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్టీఆర్ పేరును నాశనం చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు అదే ఎన్టీఆర్ పేరు రాత్రికి రాత్రే తొలగించేస్తున్న వైసీపీ తీరుపై మాత్రం ఆమె నోరు మెదపకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి.
పేదలకు మూడు పూటలా కడుపు నిండేలా అతి తక్కువ ధరకే అన్నం పెడుతున్న ఎన్టీఆర్ అన్న కేంటిన్లలో ఎన్టీఆర్ పేరును వైసీపీ సర్కారు తీసేసింది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ వైద్య సేవలో ఎన్టీఆర్ పేరును తీసేసి...దానిని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చేసింది. అయినా కూడా లక్ష్మీపార్వతి ఇప్పటిదాకా నోరు విప్పనే లేదు. ఎన్టీఆర్ తరహాలో జగన్ కూడా సంక్షేమ పాలనను అందిస్తారని చెప్పుకుంటూ వచ్చిన లక్ష్మీపార్వతి... తన భర్త పేరును తీసేస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను మాత్రం ఆమె వ్యతిరేకించడం లేదు. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు మండి పడిపోతున్నారు.
నిత్యం ఎన్టీఆర్ ను తన భర్తగా చెప్పుకుంటున్న లక్ష్మీపార్వతి... అదే భర్త పేరును మాత్రం తీసేస్తున్న వైసీపీ వైఖరిని ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే... ఇంకాస్త ముందుకెళ్లి... ఎన్టీఆర్ తన భర్త అని చెప్పుకునే లక్ష్మీపార్వతి... అదే ఎన్టీఆర్ పేరు తీసేస్తుంటే మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని కాస్తంత ఘాటు కామెంట్లే చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు లక్ష్మీపార్వతి ఇప్పుడు జగన్ విధానాలను విమర్శించలేక, అటు సమర్థించలేక సైడైపోతున్నట్టు తెలుస్తోంది. అసలు పార్టీ పరంగా ఎలాంటి క్రియాశీల పాత్ర పోషించడం లేదనే చర్చ కూడా జరుగుతోంది.