"నేనెం అందగత్తెనా?, నన్నో తల్లిని అడిగినట్టే ఎన్టీఆర్ అలా!, ఆ విషయం విని షాకయ్యా"
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నేపథ్యంలో గత కొద్ది రోజులుగా లక్ష్మీ పార్వతి పేరు ప్రముఖంగా చర్చల్లో నానుతోంది. సినిమా ప్రభావం వల్ల కావచ్చు.. ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతిల బంధం గురించి మునుపటి కన్నా ఇప్పుడే ఎక్కువమంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
'ఎన్టీఆర్ తో లక్ష్మీ పార్వతి లవ్ స్టోరీ..' : ఆరోజుల్లోనే 3లక్షల ఫోన్ బిల్
అటు మీడియా కూడా ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని లక్ష్మీ పార్వతితో ఇంటర్వ్యూలు ప్లాన్ చేసుకుంటోంది. దీంతో ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతిలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఓ టీవి ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు ప్రస్తావించారు.
తల్లిని అడిగినట్టే!.. నేనేం అందగత్తెనా?:
ఎన్టీఆర్తో అనుబంధం గురించి ప్రస్తావిస్తూ.. ఒకానొక సందర్భంలో తాను 'సామ్రాట్ అశోక్' షూటింగ్ లొకేషన్కు వెళ్లినట్టు లక్ష్మీ పార్వతి చెప్పారు. కాసేపటికి అక్కడి నుంచి బయలుదేరుతూ.. 'స్వామి! నేను వెళ్లొస్తా..' అని ఎన్టీఆర్ తో చెప్పారట. లక్ష్మీ పార్వతి అక్కడి నుంచి వెళ్లిపోతుండటంతో 'మళ్లీ ఎప్పుడొస్తున్నారు?' అని ధీనంగా అడిగారట ఎన్టీఆర్. ఆయన అలా అడిగిన తీరు.. ఒక తల్లి ఊరెళ్తుంటే పిల్లలు అడిగినట్టు ఉందని ఆమె ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
తాను అక్కడి నుంచి వెళ్తుంటే ఎన్టీఆర్ లో బాధ, నైరాశ్యం కలిగాయని చెప్పారు.అప్పటికే, నాపై ఆయన ఇంత ఆత్మీయత పెంచుకున్నారా! అని తాను ఆలోచనలో పడ్డట్టు పేర్కొన్నారు. 'ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ కోరుకుంటే లక్ష్మీపార్వతే కాదు, ఏ స్త్రీ అయినా వస్తుంది. నేనేమన్నా పెద్ద అందగత్తెనా ఆయన్ని ఆకర్షించడానికి! లేక, నా వెనుక ఏదైనా రాజకీయం ఉందా? ఆయనకు ఉపయోగపడుతుందని అనుకోవడానికి!' అని లక్ష్మీపార్వతి అన్నారు.
నా సహచర్యంలో రిలాక్స్ అయేవారు:
క్రమేపీ ఎన్టీఆర్ కు తనకు మధ్య బంధం బలపడిందన్నారు లక్ష్మీ పార్వతి. తన సహచర్యంలో ఎన్టీఆర్ రిలాక్స్ అయేవారని గుర్తుచేశారు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోమని ఎన్టీఆర్ ప్రపోజ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఓ రోజున నాచారం స్టూడియోలో ఎన్టీఆర్ ఆ విషయాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. 'నువ్వు ఒంటరినంటున్నావు..నేనూ ఒంటరినే. మన మధ్య ఆత్మీయత ఏర్పడింది కదా! మనమెందుకు పెళ్లి చేసుకోకూడదు?' అని ప్రపోజ్ చేసినట్టు తెలిపారు. దానికి తాను కొంత సమయం కావాలని అడిగినట్టు చెప్పారు. రెండు రోజులు ఆలోచించిన తర్వాత ఎన్టీఆర్ కు ఫోన్ చేసి తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నట్టు చెప్పానన్నారు.
తన్మయత్వంతో వినేదాన్ని
నరసరావుపేటలోని తన ఇంటికి ఎన్టీఆర్ ఫోన్ పెట్టించారని, ఆరోజుల్లోనే ఫోన్ బిల్లు ఏకంగా రూ.3లక్షలు వచ్చిందంటే తమ మధ్య ఎంత అనుబంధం ఉందో అర్థం చేసుకోవాలన్నారు.నాడు ఎన్టీఆర్ ఫోన్లో మాట్లాడుతుంటే ఆ తన్మయత్వంలో తానేమి చెప్పదలచుకున్నానో చెప్పలేకపోయేదాన్ని అని పేర్కొన్నారు. తన జీవిత చరిత్ర రాసే పని నిమిత్తం పలుమార్లు ఆయన సంప్రదించడానికి ప్రయత్నించానని గుర్తుచేసుకున్నారు.
ఎన్టీఆర్ ఫోన్
ఓరోజు తాను చదువుతున్న కాలేజీలో నుంచి ఎన్టీఆర్ గారికి ఫోన్ చేస్తే, ఆయన వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ చేశారు. ఎన్టీఆర్ గారితో మాట్లాడాలని చెప్పాను. కొంచెం సేపటి తర్వాత 'హలో' అంటూ ఓ గంభీరమైన స్వరం వినిపించింది. 'స్వామీ! మీరేనా!' అని అంటే, 'ఏంటీ, లక్ష్మీపార్వతిగారు. ఎందుకు ఫోన్ చేశారు?' అని ప్రశ్నించారు. ఆయనతో మాట్లాడుతున్న తన్మయత్వంలో నేను ఏం చెప్పదలచుకున్నానో మర్చిపోయాను. 'మీ జీవిత చరిత్ర రాయడానికి అనుమతివ్వండి' అని అడిగితే, 'నేనే కబురు పెడుతా' అన్నారని గుర్తుచేసుకున్నారు.
ఆ విషయం చెప్పగానే షాక్:
తాను చదువుతున్న కాలేజీకు ఓ రోజు ఎన్టీఆర్ అకస్మాత్తుగా ఫోన్ చేసినట్టు చెప్పారు. నాచారం స్టూడియోకి రమ్మని చెప్పడంతో అక్కడికి వెళ్లానన్నారు. తాను అక్కడికి వెళ్లే సరికి, ఎన్టీఆర్, మీడియా వాళ్లు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితర ప్రముఖలందరూ ఉన్నట్టు చెప్పారు. తనను చూసి ఎన్టీఆర్.. 'లక్ష్మీపార్వతి గారు రండి. నా జీవిత చరిత్ర రాయబోతున్న రైటర్ వీరే' అని అక్కడున్నవారితో చెప్పగానే.. షాకయినట్టు తెలిపారు. హిందీలో తన జీవిత చరిత్రను యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాస్తారని ఎన్టీఆర్ చెప్పినట్టు పేర్కొన్నారు.
అయితే తాను ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయడంపై పలువురు విమర్శించినట్టు చెప్పారు. సి.నారాయణరెడ్డి లాంటి ఉద్దండులు ఉంటే ఓ అనామకురాలు, లెక్చరర్ అయిన లక్ష్మీపార్వతితో ఈ జీవిత చరిత్ర రాయించడమేంటని విమర్శలు వచ్చినట్టు గుర్తుచేసుకున్నారు.