బాబుకు ఎన్ని సినిమా కష్టాల్రా సామీ..! టీడీపీ సమావేశానికి మేం రాం అంటున్న నేతలు..!!
గుంటూరు/హైదరాబాద్ : సినిమా కష్టాలు అంటే ఇవే.. ఒక సమస్య పరిష్కారం కాక ముందే మరో సమస్య ముంచుకురావడాన్నే సినిమా కష్టాలుగా అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు ఏపి తెలుగుదేశం పార్టీకి సినిమా కష్టాలు వచ్చాయని తెలుస్తోంది. పార్టీ ఓటమి నైరాశ్యంలో ఉన్న టీడిపికి అదికార పార్టీ రోజుకో కారణం చూపిస్తూ కోలుకోలేని దెబ్బ కొడుతున్న తరుణంలో సొంత నేతలు కూడా పార్టీ ఆదేశాలను అతిక్రమించడం అదిష్టానానికి మింగుడు పడని అంశంగా పరిణమించింది.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందిన తెలుగుదేశం కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొన్ని సమావేశాలు జరగగా, ముఖ్య నేతలు కూడా మరికొన్నింటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు శుక్రవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ మేరకు కార్యకర్తలకు సమాచారం కూడా అందించారు.
Recommended Video
ఓటమి బాదలోంచి బయటకు రాని తమ్ముళ్లు..! బాబు సమావేశానికి ససేమిరా అంటున్న నేతలు..!!
అయితే, ఈ సమావేశానికి నేతలు, కార్యకర్తలు ఎవరూ హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీనికి కారణం సమావేశాన్ని అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలనుకోవడమేనని సమాచారం. కోడెల ఆఫీసులో సమావేశం ఏర్పాటుపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. దీంతో గురువారం సాయంత్రం టీడీపీ పాత కార్యాలయాన్ని మళ్లీ తెరిచారు. ఈ సమావేశాన్ని అందులోనే జరపాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఎవరూ రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
టీడిపిలో ముక్కలైన క్రమశిక్షణ..! బాబుకు శిక్ష మిగిల్చుతున్న తమ్ముళ్లు..!!
తాను పార్టీని వీడబోనని ఎంతగా చెబుతున్నా, కేంద్ర కార్యాలయం నుంచి పదే పదే ఫోన్లు వస్తుండటంతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల కాకినాడలో కాపు సమావేశంలో జరిగిన పరిణామాల తరువాత ఉమ పార్టీని వీడుతారన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి బుజ్జగించారు కూడా. 1వ తేదీన అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పారు. అయినప్పటికీ, టీడీపీ కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి.
కష్టాల్లో కకావికలం..! ఐకమత్యమే ఆపద అంటున్న టీడిపి నేతలు..!!
కొందరు వ్యక్తులు టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఫోన్లు చేసి, ఉమ పార్టీని వదిలేస్తే, ఆ నియోజకవర్గంలో టీడీపీకి అందుకు దీటైన నాయకుడు ఎవరున్నారని ఎంక్వయిరీ చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న చంద్రబాబు.. బుధ, గురువారాల్లో ఉమాతో ఫోన్లో మాట్లాడారు. నియోజక వర్గంలోని కార్పొరేటర్లకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను చంద్రబాబు దృష్టికి ఉమ తీసుకెళ్లారు. ఇలా చేస్తే తన ఇమేజ్తోపాటు పార్టీ కూడా దెబ్బతింటుందని, తన నాయకత్వాన్ని ఎవ్వరూ విశ్వసించరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.
ఓటమితో అంధకారంలోకి వెళ్లిన టీడిపి..! బాబు ధైర్యం నూరి పోస్తున్నా పట్టించుకోని నేతలు..!!
ఇక దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. అటువంటి కాల్స్ పార్టీ కార్యాలయం నుంచి వస్తే ఎవర్నీ ఉపేక్షించ బోనని, అన్ని విషయాలు తెలుసుకుని కఠినచర్యలు తీసుకుంటానని ఉమాకు హామీ ఇచ్చారని తెలిసింది. ఇదిలా ఉండగా కాకినాడలో జరిగిన కాపు నేతల భేటీ అనంతరం వారంతా చంద్రబాబుతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశాన్ని జూలై 1న ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. దీనికి కాపు నేతలందరూ హాజరయ్యేలా చూడాలని చంద్రబాబు.. బొండా ఉమకు సూచించినట్లు తెలిసింది.