తెలియక ఇరుక్కున్నారు.. : సదావర్తి భూములపై రామానుజయ, "జగన్ కొంటానంటే వేలం రద్దు చేస్తాం.."
విజయవాడ : ఏపీలో సదావర్తి భూముల అంశం చర్చనీయాంశంగా మారింది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఏపీ సర్కార్ కి నోటీసులు జారీ చేసింది.
బ్రాహ్మణులకు అన్నదానం చేసే సదావర్తి సత్రానికి చెందిన 486 ఎకరాల భూముల్లో 86 ఎకరాలను ప్రభుత్వం ఏకపక్షంగా చౌక ధరలకే కాపు కార్పోరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయకు కట్టబెట్టిందని పేర్కొంటూ.. బ్రహ్మణ ఫెడరేషన్కు చెందిన ద్రోణంపాటి రవికుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 14కి వాయిదా వేసింది.
ఎకరా రూ.6.30 కోట్లు విలువ చేసే సదావర్తి భూములను ప్రభుత్వం కేవలం రూ.27 లక్షలకే కాపు కార్పోరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామునుజయకు ప్రభుత్వం కట్టబెట్టిందనేది పిటిషన్ లో పేర్కొన్న ప్రధాన ఆరోపణ.
ఇదిలా ఉంటే.. సదావర్తి భూముల కొనుగోలుకు సంబంధించి నిబంధనల మేరకే తాము భూములు కొనుగోలు చేసినట్టు చెప్పుకొచ్చిన కాపు కార్పోరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామునుజ, దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సరైన వివరాలు తెలియకపోవడం వల్లే తన కుమారుడు, అతని భాగస్వాములు సదావర్తి భూముల వేలానికి వెళ్లి ఇరుక్కుపోయారన్నారు.
సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన రామానుజ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే, సత్రం భూములన్ని అన్యాక్రంతమయ్యాయని చెప్పుకొచ్చిన ఆయన, దేవాదాయ శాఖ అధికారులు ఆ భూములకు ఎకరా రూ.6.5 కోట్లుగా నిర్దారించిన విషయం మీకు తెలియదా అన్న మీడియా ప్రతినిథుల ప్రశ్నకు జవాబు దాటవేసినట్టుగా తెలుస్తోంది.
"జగన్ కొంటానంటే వేలం రద్దు చేస్తాం.."
ఇదే విషయంలో ప్రభుత్వంపై వస్తోన్న అవినీతి ఆరోపణలపై స్పందించారు మంత్రి రావెల కిశోర్ బాబు. బహిరంగ వేలం ద్వారానే సదావర్తి భూముల అమ్మకాలు జరిగాయని వెల్లడించిన ఆయన ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించలేదని పారదర్శకంగా వేలం ప్రక్రియ చేపట్టిందన్నారు. వేలంలో జగన్ వర్గీయులే సదావర్తి భూములను సొంతం చేసుకోవడానికి పాట పాడారని మంత్రి రావెల అన్నారు.
భూముల అన్యాక్రాంతంపై స్పందిస్తూ.. తమిళనాడు ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లే సదావర్తి భూములను అన్యాక్రాంతం కాకుండా అడ్డుకట్ట వేయలేకపోయామన్నారు. కుంభకోణాల చరిత్రను వెనకేసుకున్న జగన్, ధర్మాన, బొత్స దీన్ని రాజకీయం చేయాలని చూడడం విడ్డూరమని మంత్రి రావెల ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం కట్టబెట్టిన ధర కంటే ఎక్కువ ధర తీసుకొచ్చినా లేక, జగనే కొంటానని ముందుకు వచ్చినా వేలాన్ని రద్దు చేసి ఆయనకే భూములు అప్పజెప్పడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు.