సీటు బెల్ట్, ఎయిర్ బెలూన్: నిన్న ఝాన్సీ.. నేడు శోభ
హైదరాబాద్: రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖ రాజకీయ నాయకులు దుర్మరణం చెందారు. భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు వనం ఝాన్సీ, తెలుగుదేశం పార్టీ అగ్రనేత ఎర్రన్నాయుడు.. నిన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ముఖ్యనేతల మృతి ఆయా పార్టీలకు తీరని లోటు. శోభా నాగిరెడ్డి టిడిపితో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమె అకాల జగన్ పార్టీకి పెద్దలోటు. అంతకుముందు లోకసభ స్పీకర్ జిఎంసి బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అదే పార్టీకి చెందిన మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో జరిగిన ఒక విందు కార్యక్రమానికి హాజరై అర్దరాత్రి వేళ తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
కింజారపు ఎర్రన్నాయుడు విశాఖలో జరిగిన ఒక వివాహా రిస్పెష్షన్కు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా, ఆయన కూడా అర్థరాత్రి పూట జరిగిన రోడ్ ప్రమాదంలో మృతి చెందారు. గుంటూరు జిల్లాకు చెందిన టిడిపి ప్రముఖుడు, ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు లాల్జాన్ బాషా గత ఏడాది హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి పూట గుంటూరు వెళ్తుండగా, నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన ఇంద్రారెడ్డి, ఎర్రంనాయుడు, లాల్జాన్ బాషాలు టిడిపికి చెందిన వారు. శోభా నాగిరెడ్డి టిడిపిలో రాజకీయంగా ఎదిగారు. నేతలు సీటు బెల్ట్ ధరించకపోవడం, కారులో ఎయిర్ బెలూన్ ఒపెన్ కాకపోవడం వంటి కారణాల వల్ల అకాల మృతి చెందుతున్నారు. ఇక వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. బిజెపి నేత వనం ఝాన్సీ మూడేళ్ల క్రితం మహబూబ్ నగర్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.