విశాఖలో మరోసారి విష వాయువు లీక్: ఇద్దరు మృతి: నలుగురికి గాయాలు: పలువురికి అస్వస్థత
విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నంలో మరోసారి విష వాయువు లీక్ అయింది. విశాఖపట్నం రూరల్ జిల్లాలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ గ్యాస్ లీక్ కావడం వల్ల 12 మంది మరణించిన ఉదంతాన్ని విస్మరించక ముందే.. మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. విశాఖపట్నం సమీపంలోని పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మంగళవారం తెల్లవారు జామున విష వాయువులు వెలువడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు మరణించారు. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యారు.
Recommended Video
చైనాతో చర్చలకు ముందే పైచేయి: కాస్సేపట్లో మూడో విడత భేటీ: భారత్ ప్రతిపాదనకు డ్రాగన్ ఓకే
బెంజిమిడైజోల్గా గుర్తింపు.
సాయినార్ లైఫ్ సైన్సెస్లో వెలువడిన విష వాయువులను బెంజిమిడైజోల్గా గుర్తించారు. పరిశ్రమంలో పనిచేసే పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సమచారం అందుకున్న వెంటనే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ విననయ్చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తుస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది.
ఉలిక్కిపడ్డ విశాఖ..
ఈ ఘటనపై రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి కలెక్టర్తో ఫోనులో మట్లాడారు. అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గాయపడిన, అస్వస్థతకు గురైన కార్మికులను గాజువాకలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో విశాఖపట్నం నగరవాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురయ్యారు. పరవాడ ఫార్మాసిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్ లీకేజీని అరికట్టే చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రాణాలను కోల్పోయిన షిఫ్ట్ ఇన్ఛార్జీలు
బెంజిమిడైజోల్ విష వాయువు వెలువడిన ఘటనలో మరణించిన వారిని నరేంద్ర కుమార్, గౌరీశంకర్గా గుర్తించారు. సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో వారిద్దరూ షిఫ్ట్ ఇన్ఛార్జీలుగా పని చేస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిని చంద్రశేఖర్, పీ ఆనంద్ బాబు, జానకీ రామ్, సూర్యనారాయణగా గుర్తించారు. వారిని తొలుత ను గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు.
50 లక్షల నష్ట పరిహారం డిమాండ్
ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయలను నష్టపరిహారంగా అందించాలంటూ తోటి ఉద్యోగులు, వారి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. సంస్థ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. విష వాయువు వెలువడిన సమాచారం అందిన వెంటనే పలువురు భయాందోళనలకు గురయ్యారు. పరవాడ ఫార్మాసిటీలోని మిగిలిన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు బయటికి వచ్చారు. తొలి షిప్టు ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు.