లీకేజీ సరే!, ప్యాకేజీ ఎంతో చెప్పు నారాయణ..: ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఆళ్ల చురకలు..
ఏకంగా మంత్రుల ఛాంబర్లకే చిల్లులు పడ్డా మంత్రి గారికి చిన్న విషయమే అనిపిస్తోందని మండిపడ్డారు.
అమరావతి: వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీల గోల మొదలైంది. సోమవారం కురిసిన వర్షానికి సచివాలయంలోని పలు బ్లాక్స్ లో వాన నీరు లీకేజీ అవడంతో ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది.
ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీ: వర్షపు నీటిని ఎత్తిపోసిన సిబ్బంది..
గతంలో జగన్ ఛాంబర్ లీకేజీ జరిగిన సమయంలోను ప్రభుత్వాన్ని దులిపేసిన వైసీపీ సభ్యులు.. ఇప్పుడు కూడా వరుస విమర్శలకు దిగారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లీకేజీలను ప్యాకేజీతో ముడిపెట్టి ఎద్దేవా చేశారు. లీకేజీల వ్యవహారం చాలా చిన్నదని మంత్రి నారాయణ చెబుతున్నారని, దాన్ని భూతద్దంలో పెట్టి చూడవద్దనడం సబబు కాదని అన్నారు.
లీకేజీ చిన్న విషయమైనా మీకు అందిన ప్యాకేజీ ఎంతో చెప్పాలని ఎమ్మెల్యే ఆళ్ల ఎద్దేవా చేశారు. గతంలో జగన్ ఛాంబర్ లోకి నీళ్లు లీకేజీ అయినప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా మంత్రుల ఛాంబర్లకే చిల్లులు పడ్డా మంత్రి గారికి చిన్న విషయమే అనిపిస్తోందని మండిపడ్డారు. అమరావతి సచివాలయ నిర్మాణంలో జరిగిన అవినీతిని సీఐడితో కాదు సీబీఐతో విచారణ చేయించాలని ఆళ్ల డిమాండ్ చేశారు.
రైతుల నుంచి ఉచితంగా భూమి తీసుకుని, ఉచితంగా వచ్చిన ఇసుకతో చదరపు అడుగు నిర్మాణానికి రూ.10,000 చొప్పున మొత్తం 1000 కోట్లు చెల్లించి నిర్మాణాలు చేపడితే ఒక్క వర్షానికే ఇన్ని లీకులా అంటూ ఆళ్ల ప్రభుత్వాన్ని నిలదీశారు.
లీకేజీ చిన్న విషయం:
స్లాబ్పై ఉన్న డక్ షీట్ బయటకు రావడం వల్లే సచివాలయంలో లీకేజీ జరిగిందని, దీన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. లీకేజీలు చాలా చిన్న విషయమని అన్నారు.
సాధారణంగా మనం కట్టుకునే ఇళ్లల్లోను తొలుత లోపాలు ఉంటాయని, వాటి గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వర్షం తగ్గగానే మరమ్మత్తులు ప్రారంభిస్తామని అన్నారు. సచివాలాయాన్ని నిర్మించిన సంస్థలే.. రెండేళ్ల పాటు మరమ్మత్తులు సరిచేస్తాయని చెప్పారు.