కలెక్టరేట్లో కౌలు రైతు ఆత్మహత్య...సూసైడ్ నోట్ లభ్యం...గుంటూరు జిల్లాలో కలకలం
గుంటూరు: అప్పులపాలైన ఓ కౌలు రైతు దిక్కుతోచని స్థితిలో ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు నగరంలోని కలెక్టరేట్ లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుని జేబులో ఆత్మహత్యకు గల కారణాలు రాసి ఉన్న ఉత్తరం లభించింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం...ఫిరంగిపురం మండలం అల్లంవారి పాలెంకు చెందిన కొండవీటి బ్రహ్మయ్య (55) గురువారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి సిబ్బంది గమనించారు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతిచెందాడు. కౌలు రైతు బ్రహ్మయ్య కలెక్టరేట్ లో ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది.
మృతుడు బ్రహ్మయ్య జేబులో తన ఆత్మహత్యకు గల కారణాలు రాసి ఉన్న ఉత్తరం లభించింది. తాను గత ఏడాది పదెకరాల్లో పత్తి, మిరప సాగు చెయ్యగా అందుకోసం రూ. 7 లక్షల వరకు అప్పులయ్యాయని, అవి తీరే మార్గం కనిపించలేదని ఆ లేఖలో పేర్కొన్నాడు. దాని కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు రాశాడు. ఈ ఉత్తరంలో ముఖ్యమంత్రి తనను, కుటుంబాన్నిఆదుకోవాలని రాసి ఉన్నట్టు తెలిసింది. అయితే బ్రహ్మయ్య ఆదుకోవాలని కలెక్టర్ ను కోరదామని ఆయన కార్యాలయం వద్దకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే ఆయన అందుబాటులో లేరని తెలిసి మనోవేదనకు గురై ఈ పని చేసినట్లు తెలుస్తోంది.