డిగ్రీ కాలేజీ విద్యార్ధినులకు లెక్చరర్ లైంగిక వేధింపులు, సస్పెండ్
అమరావతి: విద్యార్ధినుల పట్ల లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు డిగ్రీ కాలేజీలో చోటు చేసుకుంది. దీంతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ లెక్చరర్ను కాలేజీ విద్యాశాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నిడదవోలులోని ఎస్వీఆర్కే డిగ్రీ కాలేజీలో బోటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు జాన్శామ్యూల్. బోటనీ క్లాసులకు వచ్చే విద్యార్ధినులను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతని లైంగిక వేధింపులకు తట్టుకోలేని విద్యార్ధినులు కళాశాల ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు.
దీంతో కళాశాల ప్రిన్సిపాల్ ఆయనపై విచారణకు ఆదేశించి ఉన్నతాధికారులకు నవేదిఖ అందజేశారు. దీంతో జాన్శామ్యూల్ను సస్పెండ్ చేస్తూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. లైంగిక వేధింపులే గాకుండా, కులం పేరుతో దూషించేవాడని, కాలేజీకి వెళ్లడానికి ఇబ్బంది పడేవాళ్లమని చాలా మంది విద్యార్ధినులు విచారణ కమిటీ ముందు చెప్పారు.
లారీ ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
వైయస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండల కేంద్రంలో లారీ ఢీ కొనడంతో ఓ విద్యార్ధి మృతి చెందాడు. స్థానిక ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్న ఎర్రపోగు ప్రవీణ్ మంగళవారం ఉదయం బైక్పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో తీవ్ర గాయాలు పాలైన ప్రవీణ్ను స్ధానికులు చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే అతడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.