అలా పావులు, పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఏపీలో కీలక పరిణామాలు, జగన్కు ఎలా లాభం!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు లెఫ్ట్ పార్టీ నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు లెఫ్ట్ పార్టీ నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టిడిపి కూటమికి అండగా నిలబడిన పవన్.. 2019 ఎన్నికల్లో అధికారం దిశగా పావులు కదుపుతున్నారా? అనే చర్చ సాగుతోంది.
ప్రజా సమస్యలపై స్పందన
పవన్ కళ్యాణ్కు అధికారం, పదవులు పట్టవు. అయితే, ప్రజా సమస్యల పైన స్పందించే గుణం మాత్రం ఉందనేది పలువురి వాదన. ఆయనే స్వయంగా పదవులను అధిరోహిస్తే ఎన్నో మంచి పనులు చేయగలుగుతారనేది అభిమానుల అభిప్రాయం. ఆయన మాత్రం పదవులు వద్దని, ప్రజా సమస్యల పైన మాత్రం స్పందిస్తానని చెబుతున్నారు.
లెఫ్ట్తో భేటీ
అయితే, తాజాగా లెఫ్ట్ పార్టీ నేతలతో భేటీ చర్చనీయాంశంగా మారింది. ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పటికే పవన్.. టిడిపి-బిజెపి కూటమికి దూరంగా ఉంటున్నారనే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు.
2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్.. ఆ ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నారు. మరోవైపు లెఫ్ట్ పార్టీ నేతల బలం రాష్ట్రంలో అంతంత మాత్రమే.
పవన్కు, లెఫ్ట్కూ లాభం
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి, లెఫ్ట్ పార్టీ ఎదగాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అదే నిజమైతే.. 2019 ఎన్నికలకు పవన్కు కీలక పదవిని ఇస్తామని చెప్పి.. లెఫ్ట్ - జనసేనలు ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు.
టిడిపి-బిజెపి ఆశలపై నీళ్లు
ఆ దిశగా వెళ్తే, రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2014లో తమతో ఉన్న పవన్ కళ్యాణ్ 2019లోను కలిసే ఉండాలని ఇటు బీజేపీ, అటు టీడీపీలు కోరుకుంటున్నాయి. కానీ పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు. టిడిపి-బిజెపిల ఆశల పైన పవన్ నీళ్లు జల్లుతున్నట్లుగానే కనిపిస్తోంది.
గెలుపోటములను మార్చివేస్తారా?
పవన్, లెఫ్ట్ కలిస్తే ఏపీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని, 2019 ఎన్నికల్లో గెలుపోటములను కూడా మార్చివేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో తిరిగి గెలుపుపై టిడిపి విశ్వాసంతో ఉంది. వైసిపి కూడా అదే ఆశతో ఉంది. బీజేపీ... టిడిపి-వైసిపిలకు ప్రత్యామ్వాయం కావాలనుకుంటోంది.
టిడిపికి కాపు దెబ్బ
పవన్ - లెఫ్ట్ కలిసే పరిస్థితులే ఉన్నాయని, అదే జరిగితే ఎవరికి నష్టం? ఎవరికి లాభం అనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో టిడిపికి అండగా ఉన్న కాపులు ఆ పార్టీకి దూరమవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ద్వారా ఎదుగుదామనుకున్న బీజేపీకి కూడా ఇది షాకే అని అంటున్నారు. చంద్రబాబుకు పవన్ దూరమైతే ముద్రగడ నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు.
హోదా నుంచి నోట్ల రద్దు దాకా..
పవన్ కళ్యాణ్ బీజేపీకి దూరం కావడనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా నుంచి నోట్ల రద్దు తదనంతర పరిణామాల వరకు ఎన్నో ఉన్నాయి. అలాగే, టిడిపి పాలన పైన కూడా ఆయన అంత సంతృప్తిగా కనిపించడం లేదు. దీనిని లెఫ్ట్ పార్టీ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.
జగన్ సేఫ్
పవన్ దూరమైతే టిడిపి - బిజెపిలకు ప్రధానంగా కాపు, యువత ఓట్లు దూరమవుతాయి. ఇది ఆ పార్టీలకు ఇబ్బందికర పరిణామమే. ఓ విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్కు ఇది ఊరట కలిగించే అంశమేనని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో జగన్ ఓటమికి పలు కారణాలు ఉన్నాయి.
ఆ ఓట్లు దూరం!
టిడిపికి కలిసి వచ్చిన వాటిలో మోడీ హవా, పవన్ కళ్యాణ్ ప్రచారం ఉన్నాయి. 2019 నాటికి మోడీ హవా ఉండదు. అలాగే, పవన్ దూరం జరిగితే.. ఆ నష్టం భర్తీ చేయలేని విధంగా ఉంటుందని అంటున్నారు. కాపు, యువత ఓట్లు టిడిపికి దూరం కావడం జగన్కు లబ్ధి చేకూర్చే అంశమే అంటున్నారు.
జగన్కు లబ్ధి ఇలా..
2014 ఎన్నికల్లో సీట్లు ఎక్కువగా రాకున్నా వైసిపికి ఓట్లు మాత్రం చాలానే వచ్చాయి. ఇప్పుడు పవన్ దూరమైతే టిడిపి - బిజెపిల పైన దెబ్బ పడే అవకాశముంది. అదే సమయంలో 2014లో జగన్కు ఓటేయని (ఎక్కువ) కాపులు జనసేన వైపు వెళ్లడంతో పాటు మరికొందరు వైసిపి వైపు కూడా వెళ్తారని అంటున్నారు. నాడు వైసిపి వైపు ఉన్న యువత ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని, మరీ అయితే కొద్దిగా ప్రభావమే పడే అవకాశముందని అంటున్నారు.