చారిత్రక ఘట్టం, ఎంతో ఆనందం: పోలవరం గ్యాలరీ వాక్లో చంద్రబాబు ఫ్యామిలీ
Recommended Video
పోలవరం: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. పోలవరం స్పిల్ వే నిర్మాణంలో భాగమైన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు.
పరిశ్రమలు ఎక్కడ బాబూ! ప్రజా రాజధానా? రియల్ ఎస్టేట్ వ్యాపారమా?: ఉండవల్లి ఫైర్
ఈ సందర్భంగా చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. ఆయన వెంట స్పీకర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గ్యాలరీ వాక్ చేశారు.
గ్యాలరీ ప్రారంభం.. ఫ్యామిలీతో సందర్శన
పోలవరం ప్రాజెక్టు స్పిల్వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులు నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి, దేవాన్ష్తో కలిసి గ్యాలరీలో నడిచారు. వారి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు గ్యాలరీలో నడిచారు.
చారిత్రాత్మకమైన రోజు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ‘ఈరోజు చరిత్రాత్మకమైన రోజు. ఈ శుభసందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పోలవరం నిర్మాణంలో పెద్ద మైలురాయిని అధిగమించాం. ప్రాజెక్టు త్వరలోనే వంద శాతం పూర్తవుతుంది. రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం' అని అన్నారు.
చాలా ఆనందంగా ఉందంటూ భువనేశ్వరి..
ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడీ అని అన్నారు చంద్రబాబు. ప్రాజెక్టు కోసం ఏడు ముంపు మండలాలను కలిపామని అన్నారు. సోమవారాన్ని పోలవరంగా మార్చి ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నామని తెలిపారు. పోలవరం కుడి కాలువ పనులు 90శాతం పూర్తయ్యాయని, ఎడమ కాలువ పనులు 63.58శాతం పూర్తయ్యాయని చంద్రబాబు తెలిపారు. కేంద్రం సహకరించి ఉంటే.. పోలవరం ఇప్పటికే పూర్తయి ఉండేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించడం చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి అన్నారు.
వాళ్లకు రాజకీయం.. నాకు అభివృద్ధి
పోలవరాన్ని పూర్తి చేసి తీరతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇది జీవితంలో మరువలేని క్షణమన్నారు. గ్యాలరీ మొత్తం నడిచానని, ఎంతో అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రాజెక్టును పూర్తి చేసి తీరతామని స్పష్టం చేశారు. సవరించిన అంచనాల ఆమోదం కోసం ఢిల్లీలో మంత్రులు, అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు సూచనలు చేస్తే లోపాలుంటే సరిదిద్దుకుంటామని...రాజకీయ విమర్శలు చేస్తే పట్టించుకోమన్నారు. బీజేపీ, వైసీపీ విమర్శలు సహజమని తెలిపారు. ‘వాళ్లకు రాజకీయం కావాలి, నాకు అభివృద్ధి కావాల'ని బాబు పేర్కొన్నారు. ప్రాజెక్టును వచ్చే ఏడాది మేలోపు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కాగా, అంతకుముందుకు చంద్రబాబు కుటుంబసభ్యులతో సహా అమరావతి నుంచి హెలికాప్టర్లో పోలవరం వద్దకు చేరుకున్నారు. గ్యాలరీ పూర్తి సందర్భంగా ఏర్పాటుచేసిన పైలాన్ను ఆవిష్కరించి ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు.