అనంతలో కుంగిన భూమి, కడపలో చిరుత కలకలం, చెట్టుపైకెక్కింది
హైదరాబాద్: అనంతపురం జిల్లాలోని ఎల్లనూరు మండలం లక్షుంపల్లిలో భూమి కుంగిపోయింది. చిత్రావతి నదిలో ఇరవై అడుగుల లోతుకు భూమి కుంగిపోయింది. నదిలో బోర్లు ఎక్కువగా వేయడం వల్లే భూమి కుంగిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
గొర్రెల మందపై చిరుత దాడి
అనంతపురం జిల్లా రొద్దం మండలం లొచ్చెర్లలో గొర్రెల మంద పైన చిరుతపులులు దాడి చేశాయి. ఈ దాడిలో 70 గొర్రెలు చనిపోయాయి. సమీపంలో చిరుతపులులు తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
కడప జిల్లాలోను..
కడప జిల్లా వీరపల్లి మండలంలో చిరుత కలకలం చెలరేగింది. సానిసాయి గ్రామంలో ఓ చిరుత పులి చెట్టు పైకి ఎక్కి కూర్చుంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఏడు గంటలు కష్టపడి అధికారులు చిరుతను బంధించి, తిరుపతి జంతు ప్రదర్శనశాలకు తరలిస్తున్నారు.
చిత్తూరులో ఏనుగుల భీభత్సం
చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. తమిళనాడు సరిహద్దు ప్రాంతం నుండి వచ్చిన ఏనుగులు పీకే, సింగసముద్రం తండాల్లో పంట పొలాల్లోకి వచ్చి పంటను ధ్వంసం చేశాయి. టమోటా, అరటి తదితర పంటలు ధ్వంసమయ్యాయి.
పెంకుటిళ్లు కూలి తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి
ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగూడెంలోని మేదరపాలెం బస్తీలో పెంకుటిళ్లు కూలి తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని, శిథిలాలలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీశారు.