ఆ 22 అనుమానాలపై నిజాల్ని నిగ్గుతేల్చండి:కలకలం రేపుతున్న టిడిపి ఎమ్మెల్యే లేఖ
తిరుపతి:తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బంది బదిలీల వ్యవహారంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ వివాదంపై వర్సిటీ పూర్వ విద్యార్థి, గన్నవరం ఎమ్మెల్యే, పాలకమండలి సభ్యుడు వల్లభనేని వంశీ రాసిన ఒక లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది.
సిబ్బంది బదిలీలకు సంబంధించి 22 అంశాలపై తన అనుమానాలను నిగ్గుతేల్చమని ఉపకుపలతి డాక్టర్ హరిబాబుకు వల్లభనేని వంశీ రాసిన లేఖ విశ్వవిద్యాలయంలో తీవ్ర కలకలం రేపుతోంది. విశ్వవిద్యాలయం బదిలీ విధానంలో పారదర్శకత లేదని, విశ్వవిద్యాలయ పరిధిలోని బోధన, బోధనేతర ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రత భావాలనుతొలగించడంలో విఫలం అయ్యారని వస్తున్న ఆరోపణలపై ఆయన లేఖాస్త్రాన్ని సంధించారు.
అందరి ఆదేశాలు...బేఖాతరు
బదిలీల విషయంలో ప్రత్యేక జ్యూడిషియల్ అధికారాలు కలిగిన మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆదేశాలను బేఖాతరు చేయడం, పశుసంవర్థకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదేశాలను పట్టించుకోకుండా బదిలీలను కొనసాగించేలా ఒత్తిడి తేవడం, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి బదిలీలను తాత్కాలింగా వాయిదా వేయాలని వచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టేయడం...ఉద్యోగులను ఒత్తిడి చేసి బదిలీ ప్రాంతాలకు సాగనంపే ప్రయత్నం చేయడం జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని వంశీ తన లేఖలో పేర్కొన్నారు.
ఉద్దేశ్యం...ఏమిటి?
యూనివర్శిటీ రూపొందించుకున్న పాలసీ విధానం, ప్రభుత్వ ఉత్తర్వుల అమలు చేయకపోవడానికి కారణాలు, ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న బోధన, బోధనేతర ఉద్యోగుల వివరాలు వీటి గురించి తెలపాలంటూ లేఖలో పేర్కొన్నారు. అందులో బదిలీ చేయని వారి జాబితా, మత్య్స, వ్యాయమ, గ్రంథాలయ విభాగాల్లో జరిగిన బదిలీల జాబితా, నన్నపనేని రాజకుమారి ఉత్తర్వులు బేఖాతరు చేయడంలో ఉద్దేశమేంటని ప్రశ్నించారు. బదిలీల తరువాత కళాశాలల వారీగా పీజీ, పీహెచ్డీ విద్యను నిర్వహించేందుకు విభాగాల వారీగా మిగిలిన గుర్తింపు పొందిన అధ్యాపకుల వివరాలేంటో తెలపాల్సిందిగా కోరారు.
కారణాలు...చెప్పండి
పాలకమండలి తీర్మానం ప్రకారం ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయకపోవడానికి గల కారణమేంటో చెప్పాలని వంశి అడిగారు. బోధనేతర సంఘాలకు ఏ ప్రతిపదికన మినహాయింపు ఇచ్చారు, బదిలీ ప్రక్రియలో బోధనేతర సంఘం నాయకులు ఎందుకు ప్రతినిధ్యం వహించాల్సి వచ్చిందనే ప్రశ్నలతో 22 అంశాలపై సాక్షాలతో సహా నివేదిక సమర్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. సమగ్ర నివేదిక ప్రతులను విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులకు అందజేయాలని స్పష్టం చేశారు. గత నెల రోజులుగా వచ్చిన ఫిర్యాదులు అన్ని పొందుపరుస్తూ వచ్చిన ఈ తాజా లేఖపై అధికారులు ఇచ్చే సమాధానం కోసం బాధిత బోధన, బోధనేతర సిబ్బంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పాలన అంతా...అస్తవ్యస్తం
మరోవైపు బదిలీల ప్రకటన వెలువడిన నాటి నుంచి వర్సిటీలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని సిబ్బంది...విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ విధమైన ఉత్తర్వులు అందుతాయో అన్న ఆందోళనతో ఉన్నట్లు...విధులపైన ఏకాగ్రత నిలపలేకపోతున్నట్లు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వాపోతున్నారు. అందుకు ఉదాహరణగా...గన్నవరం పశువైద్య కళాశాలలో పనిచేస్తున్న ఓ సహ అధ్యాపకురాలిని గత నెల 23న ప్రొద్దుటూరుకు బదిలీ చేశారు. ఆ వెంటనే 26న ప్రొద్దుటూరు నుంచి తిరుపతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు సవరించారు. తిరిగి ఈ నెల 2న మళ్లీ ఆమెను తిరుపతి నుంచి గన్నవరం బదిలీ చేశారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అయోమయంలో పడడంతో విశ్వవిద్యాలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. పంతం నెగ్గించుకుని తాము అనుకున్న ప్రకారం బదిలీల ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులంతా పదే పదే రాజధానికి వెళుతున్నారు. దీంతో పాలన అంతా గాడి తప్పిందనేది వంశీ ఆరోపణ. మరి దీనిపై స్పందన ఏమిటనేది వేచి చూడాలి.