వెళ్లే ప్రసక్తే లేదు: చంపేస్తామంటూ ఎమ్మార్వో వనజాక్షికి బెదిరింపు లేఖ
విజయవాడ: గుర్తుతెలియని వ్యక్తులు కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖను పంపించారు. ఇసుక అక్రమ రవాణా కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్తో గొడవ నేపథ్యంలో వనజాక్షి పేరు ప్రముఖంగా వినిపించింది.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు వనజాక్షిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ కృష్ణా జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు కూడా దిగారు. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించారు.
వనజాక్షి పైన దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్ అనుచరుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి ఓ కమిటీ వేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో శర్మను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది. ఎమ్మార్వో వనజాక్షి కేసులో ప్రస్తుతం విచారణ సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఆమెకు ‘సీఎన్ టీపీ' పేరుతో నిన్న ఓ లేఖ అందింది. 10 రోజుల్లోగా ఊరు వదిలి వెళ్లకపోతే చంపేస్తామని ఆ లేఖలో వనజాక్షికి బెదిరింపులు వచ్చాయి. ట్రాన్ఫర్ పై వెళ్లకపోతే చంపేస్తామంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు చంపేయమని సుఫారీ ఇచ్చినట్లు లేఖలో దుండగులు పేర్కొన్నారు.
వనజాక్షి కార్యాలయంపై ఇప్పటికే రెండు సార్లు రెక్కీ కూడా నిర్వహించామని దుండగులు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ అటు రెవెన్యూ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది. బెదిరింపు లేఖను చూసిన వెంటనే వనజాక్షి దీనిపై ముసునూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ లేఖలో ఎమ్మార్వో వనజాక్షి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తెల్చి చెప్పారు. ముసునూరుని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. నాకు, నా కుటుంబానికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అధికారులకే రక్షణ లేకంటే ఎలా అని ప్రశ్నించారు. ఇసుక వివాదంలో తనపై దాడికి దిగిన వారే ఈ లేఖను కూడా రాసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.