గవర్నర్ వర్సెస్ ఎపి గవర్నమెంట్...నాలా బిల్లుపై లేఖల యుద్దం
అమరావతి: నాలా బిల్లుపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. నాలా బిల్లు పై గవర్నర్ ఆమోదం కోసం ఎపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మరోసారి విఫలమైంది.
3 నెలల క్రితం నాలాపై గవర్నర్కు కొన్ని సలహాలు ఇచ్చి బిల్లులో పొందుపర్చాలని నాలా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ కు పంపింది. అయితే ఎపి ప్రభుత్వం సలహాలను గవర్నర్ తోసిపుచ్చి దాన్ని తిప్పిపంపారు. దీంతో ఈ బిల్లుపై అసెంబ్లీలో ఆర్డినెన్స్ను ఆమోదించి నాలా బిల్లును మళ్లీ గవర్నర్ నరసింహన్ కు ప్రభుత్వం మరోసారి పంపింది. కానీ గవర్నర్ కూడా మళ్లీ ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎపి ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ఈ బిల్లు విషయమై గతంలో చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకోలేదని గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు. దీంతో గవర్నర్ లేఖను సీఎం చంద్రబాబు రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్కు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుత గవర్నర్ నరసింహన్ను తొలగించి, బడ్జెట్ సమావేశాల్లోగా కొత్త గవర్నర్ను నియమించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ ఏపీ బాగోగులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చుట్టంచూపుగా రాష్ట్రానికి వచ్చి వెళుతున్నారని, గవర్నర్ వల్ల ఏపీకి ఏమీ ప్రయోజనం లేదని చెప్పారు. రాష్ట్రంలో నివాసానికి అనువైన వసతులు లేవని రాలేకపోతున్నారా? అని ఎద్దేవా చేశారు. గవర్నర్ ఏ రోజైనా కుటుంబ పెద్దలా వ్యవహరించారా? కనీసం వారం రోజులైనా ఏపీలో ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. నాలా బిల్లును ఆరు నెలలుగా పెండింగ్ పెట్టారని విమర్శించారు.