Vizag Gas Leakage : ఫ్యాక్టరీ జీఎం రియాక్షన్ ఇదీ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనపై ఎల్జీ పాలిమర్ ఫ్యాక్టరీ జీఎం రామ్మోహన్ రావు స్పందించారు. లాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీలోని ట్యాంకులు రన్నింగ్లో లేకపోవడం.. అందులో 1800 టన్నుల స్టైరిన్ నిల్వ ఉండటంతోనే ప్రమాదం జరిగిందన్నారు. సాధారణంగా ఆ ట్యాంకర్ల కెపాసిటీ 2400 టన్నులు ఉంటుందన్నారు.
లాక్ డౌన్కు ముందే భారీగా లోడ్ తరలిరావడం.. హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఫ్యాక్టరీని మూసివేయాల్సి వచ్చిందని అన్నారు. గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు మరో 4గంటలు సమయం పడుతుందని.. ఇన్హిబిటర్తో కంట్రోల్ చేస్తున్నామని చెప్పారు. అంతవరకూ చుట్టపక్కల గ్రామాల ప్రజలు గ్రామాలకు దూరంగా ఉండాలని చెప్పారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
స్టైరిన్ గ్యాస్ మనుషులు,పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాంతులు వస్తున్నవారు డొమెస్టాల్ టాబ్లెట్ వాడాలని చెబుతున్నారు. అలాగే 48గంటల పాటు ఇంట్లోనే ఉండాలని.. తడిగుడ్డ లేదా మాస్క్ తప్పనిసరి అని చెబుతున్నారు. కళ్ల మంటలు ఉంటే ఐ డ్రాప్స్ వాడాలని... మంచినీళ్లు ఎక్కువగా తాగడం,పాలు తీసుకోవడం ద్వారా ఉపశమనం ఉంటుందంటున్నారు. అలాగే నీరసంగా ఉండేవారు సిట్రిజన్ తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే భయాందోళనకు గురై ఎక్కువమంది గుంపులుగా ఒకేచోట చేరవద్దని.. తద్వారా కరోనా కూడా విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలు స్టైరిన్తో ఎఫెక్ట్ అవడంతో.. రెస్క్యూ టీమ్,అధికారులు ప్రతీ ఇంటిని తనిఖీ చేయనున్నారు.
10కి చేరిన మృతుల సంఖ్య..
గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చాలావరకు పశువులు,మూగజీవాలు మృతి చెందాయి. పలువురు రెస్క్యూ టీమ్ సభ్యులు కూడా అస్వస్థతకు గురయ్యారు. కాసేపట్లో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి విశాఖకు బయలుదేరారు. అంతకుముందు డీజీపీ గౌతమ్ సవాంగ్,సీఎస్ నీలం సాహ్ని సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
Recommended Video
లీకేజీని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్న టెక్నికల్ టీమ్..
ప్రస్తుతం 310 మంది బాధితులు కేజీహెచ్ సహా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ లీకైన నేపథ్యంలో ఆర్ఆర్ వెంకటాపురం,ఎస్సీ కాలనీ,బీసీ కాలనీల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్లో బాధితులను ఆసుపత్రులకు తరలించారు. అధికార యంత్రాంగం ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల్లోకి ఎవరిని అనుమతించలేదు. గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేసేందుకు టెక్నికల్ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.