ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సహా 12 మంది అరెస్టు: పీసీబీ ఇంజినీర్పైనా సస్పెన్షన్ వేటు: హైపవర్ కమిటీ
విశాఖపట్నం: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఉదంతంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ నివేదిక అందిన రెండు గంటల్లోనే ఎల్జీ పాలిమర్స్ సంస్థకు చెందిన 12 మంది అరెస్టు అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి, బోర్డు డైరెక్టర్లు, ఇంజినీర్లు అరెస్టయిన వారిలో ఉన్నారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా కారణంగానే స్టైరీన్ గ్యాస్ వెలువడిందంటూ ఈ హైవర్ కమిటీ నిర్ధారించింది.
టీటీడీ సప్తగిరి మేగజైన్తో పాటే క్రైస్తవ సువార్త పుస్తకాలు: పోలీసులకు ఫిర్యాదు: కేసు నమోదు..
అరెస్టయిన వారిలో ఎల్సీ పాలిమర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సాంకీ జియోంగ్, టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్, అదనపు డైరెక్టర్ (ఆపరేషన్స్) పిచ్చుక పూర్ణచంద్ర మోహన్ రావు, ఎస్ఎంహెచ్ ఇన్ఛార్జి కోడి శ్రీనివాస్ కిరణ్ కుమార్, ప్రొడక్షన్ టీమ్ లీడర్ రాజు సత్యనారాయణ, ఇంజినీర్ చెడుముపాటి చంద్రశేఖర్, ఇంజినీర్ కసిరెడ్ల గౌరీశంకర్ నాగేంద్ర రాము, ఆపరేటర్ ముద్దు రాజేష్, ఆపరేషన్స్ విభాగం నైట్ డ్యూటీ ఆఫీసర్ పొట్నూరు బాలాజీ, జీపీపీఎస్ ఇన్ఛార్జి శిలపరశెట్టి అచ్యుత్, ఇంజినీర్ కే చక్రపాణి, నైట్ డ్యూటీ సేఫ్టీ ఆఫీసర్ కొండవలస వెంకట నరసింహ రమేష్ పట్నాయక్ ఉన్నారు.
వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ప్రభుత్వం నియమించిన అత్యున్నత స్థాయి కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన నివేదికను అందించింది. విశాఖపట్నం రూరల్ పరిధిలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో గల ఎల్సీ పాలిమర్స్ కంపెనీ నుంచి ఈ ఏడాది మే 7వ తేదీన అర్ధరాత్రి చోటు చేసుకున్న గ్యాస్ లీకేజీకి సంబంధించి పలు కోణాల్లో ఈ కమిటీ అధ్యయనం చేసింది. నాలుగు వేల పేజీల నివేదికను ముఖ్యమంత్రికి అందజేసింది.
ఈ దుర్ఘటన చోటు చేసుకోవడానికి కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులనుబాధ్యులుగా గుర్తించింది. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం జోనల్ కార్యాలయంలో పనిచేస్తోన్న పర్యావరణ ఇంజినీర్ ఆర్ లక్ష్మీనారాయణపైనా ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా చర్యల కింద ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు పీసీబీ అధికారులు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ విస్తరణకు ఆయన నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చారని నిర్ధారించారు.