విశాఖ గ్యాస్ లీక్: తగ్గని ప్రకంపనలు: ఎల్జీ పాలిమర్స్కు భారీగా వడ్డింపు: తవ్వే కొద్దీ
విశాఖపట్నం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఉదంతానికి సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గట్లేదు. తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. గ్యాస్ లీక్ కావడానికి గల కారణాలపై వివిధ కేంద్ర నిపుణుల బృందాలు వేర్వేరుగా సాగిస్తున్నాయి. ఇందులో ఒకటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ). ఎన్జీటీకి చెందిన అయిదుమంది నిపుణుల బృందం తమ దర్యాప్తును ముగించింది. ట్రిబ్యునల్కు నివేదికను అందజేసింది.
విశాఖ గ్యాస్ లీకేజీలో కొత్త కోణం: ఎన్జీటీ నివేదిక: అవుట్ డేటెడ్ ట్యాంక్..టెంపరేచర్ సెన్సర్స్
రూ. 50 కోట్ల భారీ జరిమానా
అయిదుమంది నిపుణుల కమిటీ తన నివేదికలో పొందుపరిచిన సిఫారసుల ప్రకారం ఎన్జీటీ చర్యలకు దిగింది. ఎల్జీ పాలిమర్స్ సంస్థకు 50 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని మృతులు, బాధితుల కుటుంబాలకు అందజేయాలని ఆదేశించింది. పర్యావరణాన్ని పునరుద్ధరించడానికి వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్తో కూడిన ట్రిబ్యునల్ ధర్మాసనం ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్యానికి ఆదేశాలను జారీ చేసింది.
పూర్తి బాధ్యత సంస్థ యాజమాన్యానిదే..
విష వాయువులు వెలువడటం వల్ల సంభవించిన పర్యావరణ, ప్రాణనష్టానికి పూర్తి బాధ్యత ఎల్జీ పాలిమర్స్ సంస్థదేనని స్పష్టం చేసింది. గ్యాస్ లీకేజీ ఉదంతాన్ని తాము సుమోటోగా తీసుకోవడం పట్ల ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఎన్జీటీ బెంచ్ తప్పు పట్టింది. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమకు ఉన్న అధికార వివరాలను గురించి తెలుసుకోవాలని సూచించింది. తమ అధికారాలను ప్రశ్నించే హక్కు లేదని స్పష్టం చేసింది.
అధికారాలు మరింత విస్తృతంగా..
పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదాలను సుమోటోగా తీసుకోవడానికి అధికారం ఉందని బెంచ్ పేర్కొంది. పర్యావరణ విషాదాంతాల సమయంలో బాధితుల కోసం కూడా తమ అధికారాలను విస్తృతంగా వినియోగించుకోగలమని తెలిపింది. సమర్థవంతమైన పరిహారం కోసం అటువంటి అధికారాన్ని ఉపయోగించడం తమ బాధ్యత అని గుర్తు చేసింది. పర్యావరణాన్ని పునరుద్ధరించడానికి ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో కేంద్రం పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులను నియమించనున్నట్లు పేర్కొంది.
పర్యావరణ పునరుద్ధరణకు మరో కమిటీ..
స్టైరీన్ గ్యాస్ వెలువడటం వల్ల పర్యావరణానికి సంభవించిన నష్టాన్ని ఎలా పూడ్చాలనే విషయంపై ఈ కమిటీ తన నివేదికను రెండు నెలల వ్యవధిలో సిద్ధం చేయాల్సి ఉంటుందని ఎన్జీటీ స్పష్టం చేసింది. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా పని చేయడానికి సంస్థకు అనుమతించడంలో చట్ట వైఫల్యానికి కారకులు ఎవరో గుర్తించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ ట్రిబ్యునల్ బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
Recommended Video
ఇటీవలే నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ..
ఎన్జీటీ నియమించిన అయిదుమంది సభ్యుల నిపుణుల కమిటీ ఇటీవలే ట్రిబ్యునల్కు తన నివేదికు అందజేసింది. స్టైరీన్ గ్యాస్ను నిల్వ ఉంచడానికి ఉపయోగించిన ట్యాంకు కాలం చెల్లిందని ఈ కమిటీ గుర్తించింది. 12 మీటర్ల ఎత్తు ఉన్న ఈ ట్యాంకులో గ్యాస్ ఏ స్థాయిలో నిల్వ ఉన్నదో, ఉష్ణోగ్రత ఎంతమేర నమోదు అవుతున్నదో గుర్తించడానికి ఎలాంటి పరికరాలు గానీ, సెన్సార్లు గానీ అందుబాటులో లేవని ఎన్జీటీ నిపుణుల కమిటీ గుర్తించింది. వాటిని సరిచేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అభిప్రాయపడింది.