అనుమతులే లేకుండా నడుస్తున్న ఎల్జీ పాలిమర్స్ ... పర్యావరణ నిపుణుల కమిటీ ఏం తేల్చిందంటే!!
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ తర్వాత ఎల్జీ పాలిమర్స్ సంస్థకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు ఎల్జి పాలిమర్స్ ఫ్యాక్టరీకి అనుమతులు లేవు అన్న విషయం తాజా పర్యావరణ నిపుణుల బృందం విచారణలో వెలుగులోకి వచ్చింది. ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీకి అనుమతులు లేకుండానే ఇంత కాలం నడుస్తుంది అన్న విషయం అందరిని షాక్ కు గురిచేస్తుంది .
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన కేసు విచారణ .. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలన్న హైకోర్టు
ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై తొమ్మిది విచారణా కమిటీలు
విశాఖ ఎల్జీ పాలిమర్స్లో స్టైరీన్ గ్యాస్ లీక్ తో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఇంకా ఎల్జి పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లోని ఐదు గ్రామాల ప్రజలు కోలుకోలేదు. ప్రభుత్వం అక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి వైద్య సేవలను అందిస్తుంది. ఇక ఇదే సమయంలో ఎల్జి పాలిమర్స్ గ్యాస్ ఘటనపై దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం తొమ్మిది విచారణా కమిటీలు ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై విచారణ చేస్తున్నాయి.
పర్యావరణఅనుమతులు లేకుండానే నడుస్తున్న ఎల్జీ పాలిమర్స్
అందులో భాగంగా పర్యావరణానికి సంబంధించిన నిపుణుల కమిటీ తాజాగా విచారణ జరిపింది. ఇక ఈ విచారణలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాంట్ నడుస్తున్నట్టు బయటపడింది. ప్రస్తుతం ఉన్న ప్లాంట్కు పర్యావరణ అనుమతులు లేవని నిర్ధారణ అయింది. అంతేకాదు ప్లాంట్ లో ప్రస్తుతం తయారవుతున్న ఉత్పత్తి మిశ్రమంలోనూ మార్పులు చేసిన సంస్థ ఆ మార్పులకు సంబంధించి కూడా అనుమతి తీసుకోలేదు. రోజుకు 415 టన్నుల పాలి స్టైరీన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ కు అనుమతులు లేవు అన్న విషయం పర్యావరణ నిపుణుల కమిటీని విస్మయానికి గురి చేసింది.
ఉత్పత్తి మిశ్రమంలోనూ మార్పులు చేసినట్టు గుర్తించిన నిపుణుల కమిటీ
అలాగే ప్రస్తుత ప్లాంట్లో తయారయ్యే ఉత్పత్తి మిశ్రమంలోనూ మార్పులు చేసినందుకు ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉండగా అది కూడా ఎల్జి పాలిమర్స్ తీసుకోలేదని నిపుణుల కమిటీ నిర్ధారించింది. అయితే ఎల్జీ పాలిమర్స్ సంస్థ గతంలో ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు అనుమతించాలని కోరినట్టు తేలింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే మాట అటుంచితే అసలు ఈ ప్లాంటుకే పర్యావరణ అనుమతులు లేవని తేల్చారు. ప్రస్తుతం నడుస్తున్న ప్లాంట్ పైనే ముందుగా విచారణ జరపాలని కమిటీ నిర్ణయించింది.
Recommended Video
అన్ని కమిటీల నివేదికల ఆధారంగానే విచారణ
ఈ మేరకు నిర్ణయాలను పర్యావరణ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా ఇటీవల అధికారికంగా వెల్లడించింది. గ్యాస్ లీక్ ఘటనపై గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు, హైకోర్టు ఆదేశాలు, జాతీయ మానవ హక్కుల సంఘం,పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు ఇతర అథారిటీలు, కమిటీల నివేదికల ఆధారంగా విచారణ జరపనున్నట్టు తెలిపింది నిపుణుల కమిటీ. ఏది ఏమైనా ఏపీలో పరిశ్రమల నిర్వహణలోని డొల్లతనం ఎల్జీ పాలిమర్స్ సంస్థలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనతో బయటకు వచ్చింది. ఇక ఒక ఎల్జీ పాలిమర్స్ మాత్రమే కాకుండా ఎన్ని సంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండా పనిచేస్తున్నాయి అనేది ప్రస్తుతం అందరి మనసుని తొలుస్తున్న ప్రశ్న.