చిన్నారి నాగవైష్ణవి దారుణ హత్య కేసు: ముగ్గురు నిందితులకు జీవితఖైదు
విజయవాడ: 2010 జనవరి 30వ తేదీన దారుణ హత్యకు గురైన చిన్నారి నాగవైష్ణవి కేసులో ముగ్గురు దోషులకు విజయవాడ మహిళా న్యాయస్థానం గురువారం జీవిత ఖైదువిధించింది. ఈ హత్య కేసులో పంది వెంకట్రావు, మోర్ల శ్రీనివాస్, వెంపరాల జగదీష్లకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.
ఎనిమిదేళ్ల క్రితం విజయవాడలో సంచలనం నాగవైష్ణవి హత్య కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. కారులో పాఠశాలకు వెళ్తున్న చిన్నారి నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత బాయిలర్లో వేసి దహనం చేశారు. అంతకుముందే కారు డ్రైవర్ లక్ష్మణ రావును నడి రోడ్డుపై దారుణంగా చంపేశారు.
నాగవైష్ణవిని హత్య చేసిన విషయం తెలిసి తండ్రి పలగాని ప్రభాకర్ మనోవేధనతో ఆ తర్వాత మృతి చెందారు. ఈ హత్య, మృతి పట్ల కంటతడి పెట్టని వారు లేరు. ఈ కేసులో ఏ1 మొర్ల శ్రీనివాసరావు, ఏ2 వెంపరాల జగదీష్, ఏ3 పంది వెంకట్రావ్లు ఉన్నారు. వీరు ఏడేళ్ళుగా జైల్లో ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు కాకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. ఇప్పుడు వారికి జీవితఖైదు పడింది.