అప్పట్లో నక్సల్స్తో లింక్: గంగిరెడ్డికి ఎవరి నుంచి ప్రాణహాని?
కడప: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి ప్రాణహాని ఉందంటూ ఆయన భార్య మాళవిక ఆరోపణలు చేశారు. ఈ మేరకు హైకోర్టును కూడా ఆశ్రయించారు. తన భర్త గంగిరెడ్డిని కడప జైలు నుంచి హైదరాబాద్ జైలుకు తరలించాలని ఆమె కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నుంచి తన భర్తకు ప్రాణ హాని ఉందని ఆమె ఆరోపిస్తున్నారు.
ఆమె ఆరోపణలకు కారణం లేకపోలేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలు నడుపుతున్న కాలంలో గంగిరెడ్డికి నక్సల్స్తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. తిరుమల అలిపిరి వద్ద చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేసిన ఘటనకు సంబంధించిన కేసులో గంగిరెడ్డి ముద్దాయి కూడా. అందుకే గంగిరెడ్డికి చంద్రబాబు నుంచి ముప్పు ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
కడప జిల్లా ఫాక్షన్ తగాదాలతో గంగిరెడ్డికి సంబంధం లేదు. గంగిరెడ్డి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఓ నేరస్థుడు మాత్రమే. ఎర్రచందనం అక్రమ వ్యాపారంలో అతను అంతులేని సొమ్ము సంపాదించాడని అంటున్నారు. ఆ రకంగా అతను మాఫియా డాన్గా మారాడని చెబుతారు. వ్యక్తిగతంగా అతనికి కడప జిల్లాలో శత్రువులున లేరు. అలిపిరి ఘటన నేపథ్యంలో పాతకక్షల కారణంగా చంద్రబాబు నుంచి గంగిరెడ్డికి ప్రాణ హాని ఉందని మాళవిక అంటున్నారు.
అయితే, గంగిరెడ్డికి చంద్రబాబు నుంచి ప్రాణ హాని లేదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచే ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. గంగిరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎన్నికల్లో ధారాళంగా డబ్బులు ఇచ్చాడనే ప్రచారం ఉంది. గంగిరెడ్డి నోరు విప్పితే ఆ విషయాలు బయటపడుతాయనే భయంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆయనను టార్గెట్ చేయవచ్చుననేది తెలుగుదేశం పార్టీ వాదనగా కనిపిస్తోంది.
ఈ రెండు విషయాలకన్నా అతి ముఖ్యమైన అంశం మరోటి ఉంది. ఆయన ఎర్రచందనం అక్రమ వ్యాపారానికి పోలీసులు, అటవీ అధికారులు, రాజకీయ నాయకులు సహకరించారు. అందుకు గంగిరెడ్డి వారికి పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పుతూ వచ్చాడని అంటారు. గంగిరెడ్డి తమ పేర్లను బయటపెడితే ప్రమాదమని వారు భావిస్తూ ఉండవచ్చునని అంటున్నారు. ఇటు వైపు నుంచి గంగిరెడ్డికి ప్రాణహాని ఉండవచ్చునని అంటున్నారు. కడప సెంట్రల్ జైల్లో గంగిరెడ్డిని ప్రత్యేక బ్యారక్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు.