ఏపీ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ ఎత్తివేస్తూ జగన్ సర్కార్ సంచలన నిర్ణయం: నేటి నుండి అన్ని రకాల వైద్యసేవలు ఆరంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో నియంత్రణ చర్యల్లో భాగంగా కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా మార్చి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు సంబంధించిన కరోనా బాధితులకు వైద్య సదుపాయాలు కల్పించారు. అయితే తాజాగా సుమారు ఎనిమిది నెలల తర్వాత కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సాధారణ వైద్య సేవలను ప్రారంభించనున్నారు.
కర్నూలు ఆస్పత్రిలో స్టేట్ కోవిడ్ హాస్పిటల్ ఎత్తివేత
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య సేవలను నిలిపి వేసి, కేవలం ఎమర్జెన్సీలను మాత్రమే కొనసాగించారు. అయితే ప్రస్తుతం కరోనా తగ్గిన నేపథ్యంలో, స్టేట్ కోవిడ్ ఆసుపత్రిగా ఉన్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఎత్తివేసి నేటి నుంచి అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు కర్నూలు ఆస్పత్రిలో ఏ విధమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేవో ప్రస్తుతం సదరు అన్ని విభాగాలు పనిచేస్తాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
ఎప్పటిలాగే ఓపీ.. యదావిధిగా అన్ని వైద్య సేవలు
ఎప్పటిలాగే ఓపి కొనసాగుతుందని, శస్త్ర చికిత్సలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మొన్నటి వరకు కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో స్టేట్ కోవిడ్ ఆసుపత్రి నిర్వహించిన ప్రభుత్వం, ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాలో ఆదివారం రోజు 2694 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరులు ఎనిమిది మందికి మాత్రమే కరోనా వ్యాధి సోకినట్లుగా తేలింది. జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న బాధితుల సంఖ్య 60,295కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో కరోనా బాధితులు 109 మంది చికిత్స పొందుతున్నారు. 59,699 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Recommended Video
ఏపీలో మొత్తం కరోనా కేసులు .. బాగా తగ్గినా కరోనా బాధితుల సంఖ్య
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు చూస్తే 8,71,972 కేసులు నమోదు కాగా 5,910 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. నిన్న ఒక రోజు 914 మంది కరోనా నుండి కోలుకోగా మొత్తం కరోనా నుండి కోలుకున్న కేసుల సంఖ్య 8,59,029 గా ఉంది. ఇప్పటివరకు కరోనా కారణంగా 7,033 మంది మృతిచెందగా నిన్న ఒక్క రోజే తొమ్మిది మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి కరోనా పరీక్షలు నిర్వహించారు.