ఏపీలో ఇవాళ,రేపు వర్షాలు... బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్...
ఆంధ్రప్రదేశ్లో శుక్ర,శనివారాల్లో(నవంబర్ 6,7) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీలంక తీరానికి దగ్గరలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 0.9కి.మీ ఎత్తు వరకు వ్యాపించిందని పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 48గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో వాయుగుండంతో గత నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఏపీలో కొన్ని ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాల్లో తీవ్ర పంటనష్టం జరిగింది. మొత్తంగా వర్షాల కారణంగా రూ.10వేల కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు. ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందం నవంబర్ రెండో వారంలో రాష్ట్రానికి రానుంది. నవంబర్ 9,10 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించి, వరద నష్టాన్ని అంచనా వేయనుంది. గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఆ బృందం పర్యటించనుంది.
రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం... ఆర్అండ్ బీకి సుమారు రూ.5వేల కోట్ల నష్టం వాటిల్లింది. రోడ్లు, వ్యవసాయ, ఆక్వా ఉద్యాన పంటలు, విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలకు భారీగా నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1000 కోట్లు అందించాలని ఇదివరకే సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు.
మరోవైపు జూన్-సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఇన్ పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. నష్టపోయిన వ్యవసాయ పంటలకు రూ. 113 కోట్లు, ఉద్యాన పంటలకు రూ. 22 కోట్ల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ చెల్లించింది. 33శాతం కంటే ఎక్కువగా దెబ్బతిన్న పంటలకు ఈ సబ్సిడీ అందించారు.