నిమ్మకు నీరెత్తినట్లు: నిలువునా నిమ్మరైతుల నిలువుదోపిడి..
కూరగాయల మార్కెట్లో ఒక నిమ్మకాయ ధర రూపాయి. కిలోకు సగటున 16 నిమ్మకాయలు తూగుతాయి. దాని ప్రకారం కిలో నిమ్మకాయలు కొనుగోలు చేయాలంటే రూ.16 ఖర్చు అవుతుంది.
హైదరాబాద్/ అమరావతి: కూరగాయల మార్కెట్లో ఒక నిమ్మకాయ ధర రూపాయి. కిలోకు సగటున 16 నిమ్మకాయలు తూగుతాయి. దాని ప్రకారం కిలో నిమ్మకాయలు కొనుగోలు చేయాలంటే రూ.16 ఖర్చు అవుతుంది. కానీ రైతులు అమ్మే కిలో నిమ్మకాయలకు సగటున నాలుగు రూపాయలు మాత్రమే.. ఇదంతా దళారుల మాయ. 'ఉత్తరాదిన డిమాండ్ లేదు, మార్కెట్కు అవసరం లేదు, కాయలో నాణ్యత లేదు, రంగు లేదు' అని అంటూ కుంటిసాకులు చెబుతూ ధరను దారుణంగా తగ్గించేస్తున్నారు.
నిమ్మకాయలకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా పేరున్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుతోపాటు ప్రకాశం జిల్లా కనిగిరి మార్కెట్లోనూ ఇదే తంతు. వ్యాపారులు కుమ్మక్కై 'నిమ్మ' కాయల రైతులకు ద్రోహం చేస్తున్నారు. నిమ్మకాయల మార్కెట్ యార్డుల్లో దళారులు చెప్పిందే వేదం. రోజుకో ధర చెబుతూ రైతుల నుంచి ఇష్టారాజ్యంగా కొనుగోలుచేస్తున్నారు. ఇలా ఈ వారంలో నిమ్మకాయల ధరలు కిలోకు రూ.4 మించలేదు. తోటల నుంచి కాయలను కోసి, ఆటోల్లో మార్కెట్కు తరలించడం ఈ ధరతో ఎలా సాధ్యమని రైతులు వాపోతున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలోనూ నిమ్మకాయల ధర కిలో రూపాయికి పడిపోగా, ప్రభుత్వం జోక్యం చేసుకుని దళారుల ఆటకట్టించింది. అదీ తాత్కాలికమే. ఇపుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60వేల హెక్టార్లలో నిమ్మ సాగు ఉంది. ప్రకాశం, పశ్చిమగోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అధికంగా పండిస్తున్నారు. దెందులూరు మార్కెట్ నుంచి రోజుకు సగటున 120 టన్నులు, కనిగిరి మార్కెట్ నుంచి 90 టన్నులు, ఇలా రాష్ట్రవ్యాప్తంగా రోజూ 1200 టన్నుల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. వీటిలో అధికంగా బెంగళూరు, చెన్నై, పాట్నా, ముంబై, లక్నో తదితర నగరాలకు ఎగుమతి చేస్తారు.
టన్ను నిమ్మకాయలపై నష్టం ఇలా
ప్రస్తుత ధర ప్రకారం 50 కిలోల నిమ్మకాయల బస్తాకు రైతుకు దక్కేది రూ.100- రూ.150 మాత్రమే. అదే టన్ను కాయలకు రైతు చేస్తున్న ఖర్చు రూ.200 దాటుతోంది. కోత ఖర్చు రూ.150, రవాణా, తదితర అంశాల ఖర్చులు రూ.50 తప్పడం లేదు. రైతులకు బస్తాకు రూ.50 చొప్పున నష్టం లెక్కించినా టన్నుకు రూ.1000 కోల్పోతున్నారు. ఈ నష్టాలను తట్టుకోలేక రైతులు నిమ్మసాగు నుంచి వైదొలుగుతున్నారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు, పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి, దేవరపల్లి మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కుళ్లిపోతున్న కాయలు, నరికేసిన చెట్లు కనిపిస్తున్నాయి.
రవాణా ఖర్చులూ రావాయే!
Recommended Video
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు వాసి సత్యనారాయణరెడ్డి 20ఎకరాల్లో నిమ్మసాగు చేసేవారు. దిగుబడి, ధరలు లేక నష్టాలు వస్తుండడంతో ఇటీవల పదెకరాల్లో నిమ్మచెట్లు నరికేశారు. వారం రోజులుగా కిలో కాయల ధర సగటున రూ.4 దాటకపోవడంతో మిగిలిన తోటను భరించలేనని వాపోతున్నారు. బస్తా కాయల కూలీకి రూ.200, రవాణాకు రూ.50 పోతుంటే, అమ్మాక రూ.100 కూడా మిగలడం లేదనేది ఆయన ఆవేదన.
పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామ వాసి సీహెచ్ వెంకటనారాయణ దశాబ్దాల కాలంగా నిమ్మసాగు చేస్తున్నారు. గ్రామంలో 80శాతం నిమ్మతోటలే. కిలోమీటర్ దూరంలోనే మార్కెట్ యార్డు ఉన్నది. అమ్మకానికి తీసుకెళ్తే కూలీ, రవాణా ఖర్చులైనా రావడం లేదు. వారం రోజులుగా కిలో కాయల ధర సరాసరిన చూస్తే రూ.4 మించడం లేదు. కిలోకి రూ.15 నుంచి 20 లభిస్తే కానీ గిట్టుబాటు కాదు. అందుకే నిమ్మతోటలను నరికేస్తున్నానని వాపోయారు.
దాచుకునే దారి లేక !
పంటకు ధర తగ్గితే ఉత్పత్తిని దాచుకుని మంచిధరలు వచ్చినపుడు అమ్ముకునేందుకు ప్రభుత్వం రైతుబంధు వంటి వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నా, అవి నిమ్మరైతులకు చేరడం లేదని విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా నిమ్మకాయలు దాచుకునే శీతల గిడ్డంగులు లేవు. కనీసం మార్కెట్ యార్డుల్లోనూ వీటిని నిర్మించడం లేదు. సెస్, కమీషన్ అంటూ రైతుల నుంచి నాలుగు శాతం వసూలు చేస్తున్న సొమ్ము సద్వినియోగం కావడం లేదు. దాచుకునే వీలులేక ఈ వారంలో కనిగిరి ప్రాంతంలో ఏకంగా 20 టన్నుల నిమ్మకాయలను రైతులు పారబోయటం ఈ పంట పండించే రైతుల దుస్థితికి అద్దం పడుతోంది.