ఏపీ, తెలంగాణా సరిహద్దులలో అంబులెన్స్ లకు లైన్ క్లియర్.. కోర్టు అక్షింతల తర్వాత అనుమతి
ఎట్టకేలకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ లకు లైన్ క్లియర్ అయింది. గత రెండు రోజులుగా రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. దీంతో చాలా మంది కరోనా బాధితులు సైతం దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం పోలీసులు అంబులెన్స్ లకు అనుమతిస్తున్నారు.
కరోనా చికిత్సకు రోజుకు లక్ష..ఆగని ప్రైవేట్ దోపిడీ..వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షేనా?
ఏపీ వాహనాలను నిలిపివెయ్యాలని తెలంగాణా సర్కార్ ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే, మరోపక్క అడుగడుగునా పోలీసులు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలు కరోనా బాధితులకు తీవ్ర ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి.మొన్నటివరకు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలు కొనసాగాయి. అయితే ఏపీలో కేసులో పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న వాహనాలను నిలిపివేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అంబులెన్స్ లను సైతం నిలిపివేసిన తెలంగాణా పోలీసులు
ఈమేరకు సరిహద్దుల్లో ఏపీ నుండి వచ్చే వాహనాలను నిలిపివేశారు. హెల్త్ ఎమర్జెన్సీ అన్నా సరే, అంబులెన్సులను సైతం నిలిపివేసిన పరిస్థితి. కరోనా బాధితులు ఆస్పత్రికి వెళ్లాలన్నా సరే పోలీసులు సదరు ఆసుపత్రి నుండి బాధితులను అడ్మిట్ చేసుకోడానికి అంగీకరిస్తూ అనుమతి పత్రాన్ని చూపించాలని కోరారు.దీంతో ఏపీ నుండి వచ్చే అంబులెన్సులు సైతం తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే వెసులుబాటు లేక నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నిన్న రాత్రి వరకు అవే ఆంక్షలు కొనసాగాయి.
ఏపీ, తెలంగాణా సీఎం ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు
తాజా పరిస్థితులలో ఏపీ ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల సీఎంలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో, తెలంగాణలో అంబులెన్స్ సైతం అనుమతించకపోవడం వంటి అంశాలపై స్పందించిన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి కోర్టులు చెప్పినా స్పందించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించి ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దు వద్ద నెలకొంటున్న సమస్యపై రెండు రాష్ట్రాల డీజీపీలు అధికారిక ప్రకటన ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
హైకోర్టు ఆగ్రహంతో నేటి నుండి అంబులెన్స్ లకు లైన్ క్లియర్
తాజాగా తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో నేటి నుండి ఏపీ నుండి వచ్చేస్తే అంబులెన్సులను తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. హైదరాబాద్ వైపు ఏపీ నుండి చాలా మంది కరోనా బాధితులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణాలో లాక్ డౌన్ కొనసాగిస్తున్న కారణంగా, పోలీసులు వాహనాల రాకపోకలపై ప్రత్యేక నిఘా పెట్టారు.