ఏపీలో బిగ్ బ్రేకింగ్: దివాలా దిశగా లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఏపీ ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు చెందిన లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (LEPL) దివాలా దిశగా పయనిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ వద్ద నవంబర్ 14వ తేదీన లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దివాలా పిటిషన్
లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉందని ఆ పిటిషన్లో పేర్కొంది. రుణదాతల నుంచి తీసుకున్న రుణాలను ప్రస్తుతం తిరిగి చెల్లించే పరిస్థితుల్లో లేదని లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్లో స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ను కూడా మీడియాకు విడుదల చేసింది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎంఎస్ మనో రంజని పేరుతో ఈ నోటిఫికేష్ విడుదల చేయడం జరిగింది.
రుణదాతలు ఆధారాలతో రావాలన్న బోర్డు
ఇక దివాలా తీయడంతో ఆ తర్వాత జరగాల్సిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభమై మే 12, 2020 నాటికల్లా ముగుస్తుందని నోటిఫికేషన్లో తెలపడం జరిగింది. ఈ క్రమంలోనే లింగమనేని ఎస్టేట్స్కు రుణాలు ఇచ్చిన రుణదాతలంలా నవంబర్ 29లోగా తగిన ఆధారాలు డాక్యుమెంట్లు తీసుకుని బోర్డు ముందుకు హాజరుకావాల్సిందిగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అమరావతి, విజయవాడలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు
మార్చి 1996లో లింగమనేని ఎస్టేట్స్ ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ రిజిస్టర్ ఆఫీస్ విజయవాడలో ఉండగా.. కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాదులోని బంజారా హిల్స్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో లింగమనేని రమేష్ పలు ప్రాజెక్టులు చేపట్టారు. ఇక విజయవాడ, అమరావతిలో ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఎయిర్ కోస్టా పేరుతో విమానాల ప్రాజెక్టును ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రాజెక్టుల కోసం కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున అడ్వాన్స్ల పేరుతో డబ్బులు వసూలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ దివాలా తీస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ డబ్బులన్నిటినీ లింగమనేని తిరిగి కస్టమర్లకు చెల్లించాల్సి ఉంటుంది.
లింగమనేని గెస్ట్ హౌజ్కు ఏపీ ప్రభుత్వం నోటీసులు
లింగమనేని తలపెట్టిన ప్రాజెక్టులు పట్టాలెక్కకపోవడం, డబ్బులు ఇరుక్కునిపోవడంతో ఆయన చేతులెత్తేశారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ ముందు దివాలా పిటిషన్ దాఖలు చేశారు. ఈ మధ్య కాలంలోనే లింగమనేని పేరు ప్రముఖంగా వార్తల్లో వినిపించింది. కృష్ణానది కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్హౌజ్ అక్రమకట్టడం అంటూ పేర్కొంటూ జగన్ సర్కార్ దాన్ని కూల్చేందుకు నోటీసులు ఇచ్చింది. ఈ గెస్ట్ హౌజ్ను టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్దెకు తీసుకున్నారు. అయితే చంద్రబాబు ఇంకా ఆ నివాసంలోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉంది.