లింగమనేని అక్రమాలు బయటపెడతా .. చంద్రబాబుకు ఇల్లు ఇచ్చింది అందుకే అంటున్న ఆర్కే
మంగళగిరి నియోజకవర్గంలో లింగమనేని రమేష్ ఎన్నో అక్రమాలు చేశారని, వాటిని ప్రజలకు చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు . ఆయన అక్రమాల చిట్టా విప్పుతామని సీఆర్డీయే చైర్మన్ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తెలిపారు . కనీస నిబంధనలను కూడా పాటించకుండా అక్రమంగా లేఔట్లు వేసి వెంచర్లను చేసి కోట్లు సంపాదించారని మండిపడిన ఆళ్ళ గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన భూ బాగోతాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని తాము సీఎంని కోరతామని ప్రకటించారు.
కేంద్రం మెడలు వంచుతామని చెప్పి జగన్ కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు సాష్టాంగపడ్డారన్న లోకేష్
మంగళగిరి నియోజకవర్గ పరిధిలో లింగమనేని 40 ఎకరాల్లో అక్రమ లేఔట్లను వేశారన్న ఆళ్ళ
మంగళగిరి నియోజకవర్గంలో నిర్దిష్ట సమాచారం లేకుండా అపార్టుమెంటులు కానీ, ఖాళీ స్థలాలు కానీ కొనుగోలు చేయవద్దని ఆళ్ల రామకృష్ణా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే చాలా మంది అక్రమార్కులు కనీస అనుమతులు కూడా లేకుండా , అక్రమ నిర్మాణాలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇక లింగమనేని రమేష్ అక్రమాల చిట్టా త్వరలోనే బయటపెడతామని పేర్కొన్నారు ఆళ్ళ . ఆయన మంగళగిరి నియోజకవర్గ పరిధిలో సుమారు 40 ఎకరాల్లో లేఔట్లను వేసి, విలాసవంతమైన విల్లాలు కట్టారని అన్నారు. ఆ విల్లాలను ఒక్కోదాన్ని 5 కోట్లకు అమ్ముకున్నారని, కాజా గ్రామానికి కట్టాల్సి ఉన్న బిల్డింగ్ పర్మిట్, లే అవుట్ ఫీజులను కూడా ఇప్పటి వరకు కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
40 నుంచి 50 కోట్ల వరకు పంచాయితీ ఫీజులు ఎగ్గొట్టిన లింగమనేని .. చంద్రబాబుకు ఇల్లు ఇచ్చింది అందుకే అన్న ఆళ్ళ
గజం విలువ నాలుగు వేలుగా రిజిస్ట్రేషన్ విలువ చూపించి సుమారు 40 నుంచి 50 కోట్ల వరకు పంచాయితీకి రావాల్సిన ఫీజును ఆయన ఎగ్గొట్టారని పేర్కొన్నారు. అంతే కాకుండా కాకుండా పంచాయితీ మీదే కేస్ వేశారని విమర్శించారు. లింగమనేని రమేష్ చేసిన అక్రమాలపై మాట్లాడకుండా ఉండేందుకే చంద్రబాబుకు కృష్ణా నది కరకట్ట మీద ఉన్న గెస్ట్ హౌస్ ఇచ్చారని ఆరోపించారు. ఇక లింగమనేని నివాసం ఇవ్వటంతో చంద్రబాబు లింగమనేని విషయంలో సైలెంట్ అయ్యారని పేర్కొన్నారు.
విజిలెన్స్ దర్యాప్తు కు సీఎంను కోరతానన్న సీఆర్డీయే చైర్మన్ ఆళ్ళ
అక్రమ కట్టడాలు కట్టి, పంచాయితీలకు రావలసిన ఫీజులు చెల్లించకుండా పంచాయితీల మీద ఆయన వేసిన కేసులను బెంచ్ మీదికి రాకుండా లింగమనేని మేనేజ్ చేశారని, ఈ అంశంపై విజిలెన్స్ దర్యాప్తు చెయ్యాల్సిన అవసరం ఉందని ఆర్కే పేర్కొన్నారు. దర్యాప్తుకు ఆదేశించాలని తాను ముఖ్యమంత్రి జగన్ని కోరతానని ఆళ్ళ తెలిపారు. ఒక్క తన నియోజకవర్గంలోనే 40 నుంచి 50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని, చంద్రబాబుకు కరకట్ట మీద ఉన్న ఇల్లు అందుకే ఇచ్చారని సీఆర్డీయే చైర్మన్ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఆరోపించారు .