'ఎర్ర' లింక్స్: ఎస్పీ మండిపాటు, ఆరుగురి సస్పెన్షన్
కడప: ఎర్రచందనం స్మగ్లర్లతో పోలీసుల సంబంధాలపై కడప జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) నవీన్ గులాటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తంబేపల్లె, రాయచోటి పోలీస్స్టేషన్లలోస్మగ్లర్లతో సంబంధమున్న ఆరుగురు కానిస్టేబుళ్లను ఆయన సస్పెండ్ చేశారు. స్మగ్లర్లతో సంబంధాలున్నాయని అనుమానమున్న మరో ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు విచారిస్తున్నారు.
జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలపై ఇటీవల పూర్తి స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఒంటిమిట్ట చోరీ కేసుపై ఎస్పీ నవీన్ గులాటీ చర్యలు చేపట్టారు రాత్రి పది మంది దుండగులు పోలీస్స్టేషన్లోకి చొరబడి ఆవరణలో ఉన్న ఎర్రచందనం దుంగలను తీసుకెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించిన నవీన్ గులాటీ తంబేపల్లె, రాయచోటి పోలీస్స్టేషన్లలో ఆరుగురు కానిస్టేబుళ్ళను ఎస్పీ సస్పెండ్ చేశారు.
కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు. స్టేషన్ ఆవరణలో ఉంచిన ఎర్రచందనం దుంగలను ఎత్తుకెళ్లిపోయారు. ఎర్రచందనం దొంగల భరతం పడతామని ఒంటిమిట్ట స్టేషన్ నుంచి టాస్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించిన రెండు, మూడు రోజులకే స్టేషన్లో ఈ ఘటన జరిగింది.
ఈ మండలానికి చెందిన బొడ్డే వెంకటరమణ అనే బడా స్మగ్లర్తో పాటు మరో ఐదారుగురిని కడప పోలీసులు అరెస్టు చేసి రూ.9 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకున్న దుంగలనే ఎర్రచందనం స్మగ్లర్లు గురువారం రాత్రి ఎత్తుకెళ్లడం పోలీసులకు సవాల్ విసిరినట్లయింది. స్టేషన్లో 160 దుంగలు ఉండగా.. 18 దుంగలు తీసుకెళ్లారు. వీటి విలువ రూ.కోటి వరకూ ఉంటుందని అంటున్నారు.