సినీఫక్కీలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో మద్యం బాటిళ్ళు: సీసీ టీవీ ఫుటేజ్ లో షాకింగ్ నిజాలు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం అభ్యర్ధులు వింత వింత చర్యలకు పాల్పడుతున్నారు . దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్ లు , నామినేషన్ పత్రాల చించివేతలు, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరింపులు మాత్రమే కాదు సినీ ఫక్కీలో జిమ్మిక్కులు మొదలెట్టారు. ప్రత్యర్ధులను దెబ్బకొట్టేందుకు ఎలాంటి పని చేయడానికైనా వెనకాడటం లేదు .
ఏపీలో టీడీపీ పోటీలో లేకుండా చెయ్యాలని, దెబ్బకొట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యర్ధులు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు . సినిమాటిక్ డ్రామాలా గుంటూరు జిల్లా తెనాలిలో 4 వ వార్డు టీడీపీ అభ్యర్ధి ఇంటివద్ద జరిగిన సంఘటన రాష్ట్రంలోని పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పకనే చెప్తుంది . తెనాలి 4 వ వార్డు అభ్యర్థి ఇంట్లోకి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశిం చారు. వారు మద్యం బాటిళ్లు వాటర్ ట్యాంక్ వద్ద ఉంచి పరారయ్యారు.
ఉదయాన్నే సడన్ గా టీడీపీ అభ్యర్ధి ఇంటికి వచ్చిన ఎక్సైజ్ అధికారులు దాడిచేశారు. ట్యాంక్ సమీపంలో మద్యం బాటిళ్లతో పాటు పెంట్ హౌస్లో ఉండే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టటానికి మద్యం బాటిళ్ళు తెచ్చారని కేసు నమోదు చేశారు . తమ ఇంట్లోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయో తెలియక ఆశ్చర్యపోయిన బాధితులు సీసీ ఫుటేజ్ పరిశీలించి షాక్ తిన్నారు.
అర్ధరాత్రి మాస్కులు కట్టుకుని స్కూటీ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు మద్యం బాటిళ్లు పెట్టి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే వైసీపీ నేతలు మద్యం బాటిళ్ళు పెట్టి వెళ్ళారని చెప్పారు . సీసీ ఫుటేజ్లో ఉన్న వారిని గుర్తించడం మానేసి తమ ఇంట్లోని వారిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతలే తమ ఇంట్లో మద్యం బాటిళ్లు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.