దారి తప్పారు.. ఇద్దరూ ఒకే మహిళతో!: సెప్టిక్ ట్యాంకులో శవమై.. ఇలా వెలుగులోకి..
Recommended Video
తాడేపల్లి: బతుకుదెరువు కోసం వలసవెళ్లిన ఓ వ్యక్తి అక్రమ సంబంధం ఉచ్చులో చిక్కుకుపోయి బలైపోయాడు. అవసరం కోసం విచ్చలవిడి తనానికి అలవాటుపడ్డ మహిళ చివరాఖరికి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.
తోటి కార్మికుడు తనకంటే ఎక్కడ పైకి ఎదుగుతాడేమోనన్న అక్కసు మరో కార్మికుడి చేత హత్య చేయించింది. మొత్తంగా ఒక్క హత్య ఆ ముగ్గురి కుటుంబాలను రోడ్డున పడేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి కొత్తూరు ఎన్టీఆర్ కట్టపై హత్య ఘటనలో వెలుగుచూసిన విషయాలివి.
అసలేంటి కథ:
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా దామవరపు మండలం రామకృష్ణాపురానికి చెందిన మార్కండి రాజయ్య(35) బతుకుదెరువు కోసం 10ఏళ్ల క్రితం విజయవాడ వచ్చాడు. స్థానికంగా ఓ లిక్కర్ డిపోలో ముఠా కార్మికుడిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. మంచిర్యాల జిల్లా బెల్లంకొండకు చెందిన సుధాకర్ కూడా అదే డిపోలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు.
అక్రమ సంబంధం:
తాడేపల్లి కొత్తూరుకి చెందిన చిక్కల కమలగాయత్రి అనే యువతి వీరు పనిచేసే లిక్కర్ డిపో వద్ద పగిలిపోయి సీసా పెంకులు ఏరుకునేది. వాటిని అమ్ముకుని జీవనం సాగించేది. ఈ క్రమంలో సుధాకర్, రాజయ్యలతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
గాయత్రి అవివాహితురాలు కావడంతో ఇద్దరూ ఆమెకు దగ్గరయ్యారు. గాయత్రి కూడా ఒకరికి తెలియకుండా మరొకరితో సహజీవనం సాగించింది. ఈ క్రమంలో ఆమెకు ఓ కుమారుడు కూడా పుట్టాడు. గాయత్రి విషయంలో రాజయ్య-సుధాకర్ ల మధ్య విజయవాడ ఆటోనగర్ లో ఓసారి గొడవ జరిగింది. ఇద్దరూ గొడవపడుతుండటంతో డిపో వద్ద పని మానేసి తాడేపల్లిలోని అపార్ట్ మెంట్లలో గాయత్రి పనికి కుదిరింది.
ఇలా తారాస్థాయికి:
గాయత్రి విషయంలో మొదలైన విభేదాలు.. పని ప్రదేశంలో తలెత్తిన విభేదాలతో తారాస్థాయికి చేరుకున్నాయి. లిక్కర్ డిపోలో మేనేజర్ డ్రైవర్ పోస్టు విషయంలో సుధాకర్, రాజయ్యల మధ్య విబేదాలు తలెత్తాయి.
లిక్కర్ డిపో మేనేజర్ రాజయ్యను నమ్మి పర్సనల్ డ్రైవర్గా నియమించుకున్నాడు. ఆయన బదిలీ తర్వాత కొత్తగా వచ్చిన మేనేజర్.. మరో డిపో మేనేజర్.. సుధాకర్ను డ్రైవర్గా పెట్టుకున్నాడు. కొత్త మేనేజర్ కూడా త్వరలోనే బదిలీ అవుతుండటం సుధాకర్ కు ఆందోళన కలిగించింది. కొత్తగా వచ్చే మేనేజర్ రాజయ్యనే డ్రైవర్ గా పెట్టుకుంటాడన్న ప్రచారం ఆ ఆందోళనను మరింత తీవ్రం చేసింది.
గాయత్రి ఇంటికి రప్పించి:
డ్రైవర్ పోస్టు ఎక్కడ రాజయ్యకు దక్కుతుందోనన్న అక్కసుతో అతన్ని హత్య చేయడానికి నిర్ణయించుకున్నాడు సుధాకర్. అక్టోబర్ 24న గాయత్రితో కలిసి రాజయ్యను హత్య చేసేందుకు పథకం రచించాడు. అనుకున్నట్లుగానే అక్టోబర్ 29న గాయత్రి రాజయ్యను ఇంటికి పిలిచింది. ఆపై రాజయ్య కళ్లలో కారం కొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి, రోకలి బండతో మోది కిరాతకంగా చంపి, దూలానికి ఉరి వేశారు. మృతదేహాన్ని పాత సెప్టిక్ ట్యాంక్లో పూడ్చేశారు.
ఇలా వెలుగులోకి:
రాజయ్య కనిపించకుండా పోవడంతో అతని భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సుధాకర్ను, కమలగాయత్రిని విచారించగా పెద్దగా వివరాలేమి రాబట్టలేకపోయారు. అయితే ఫోన్కాల్స్ రికార్డుల ద్వారా పునఃవిచారణ నిమిత్తం గాయత్రి ఇంటికి వెళ్లగా.. ఆమెనాలుగేళ్ల కుమారుడు అసలు నిజం చెప్పాడు.
ఘటన గురించి అతన్ని ప్రశ్నించగా.. 'అమ్మ, మరో వ్యక్తి కలిసి రోకలితో ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు'అని రోకలిని చూపిస్తూ చెప్పాడు. దీంతో గాయత్రి, సుధాకర్ లను విచారించడంతో మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేసినట్లు అంగీకరించారు.