బాబూ నువ్ సెప్పూ.. ఆణ్ని చెయ్యమని సిప్పూ.! ఏపీలో మందు బాబుల మహా కష్టాలు.!
అమరావతి/హైదరాబాద్ : ఊరు కొట్టుకుపోయి ఒకడు ఏడుస్తుంటే కారు కొట్టుకుపోయి మరొకడు ఏడ్చాడట. ఆంధ్రప్రదేశ్ లో అచ్చం ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో మందు బాబులు దాదాపు డెబ్బై రోజులకు పైగా తమ ప్రియమైన మద్యపానానికి దూరంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆంక్షలు ఎత్తివేసారో అప్పటినుండి మద్యానికి కొరత ఏర్పడలేదు గాని, వైసీపి ప్రభుత్వం దశల వారీగా మద్యాన్ని ఎత్తివేసేందుకు సన్నాహాలు చేస్తుండడంతోనే అసలు సమస్య మొదలైనట్టు తెలుస్తోంది. మందు కోసం, వాటిలో దొరికే రకాల కోసం ఏపిలో మద్యం ప్రియులు పడరాని పాట్లు పడుతున్నట్టు తెలుస్తోంది.
అలుముకున్నవి కారు మబ్బులు కాదు.!కరోనా మబ్బులు.!తరిమికొట్టడమా.?తడిసి పోవడమా.?
ఆంధ్ర లో మద్యం బ్రాండ్ల కొరత.. తెలంగాణ సరిహద్దులకు క్యూ కడుతున్న మందు బాబులు..
ఆంధ్ర ప్రదేశ్ లో మొన్నటివరకూ ఏరులై పారిన మద్యం ప్రస్తుతానికి దొరకడం లేదు. అంటే మద్యం ప్రియుల అభిరుచికి తగ్గ బ్రాండ్లు అస్సలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మద్యం ప్రియులు. తమకు కావాల్సిన బ్రాండ్ అందుబాటులో లేకపోవడంతో మందుబాబులు ఏకంగా బోర్డర్ దాటేస్తున్నారు. ఇదే అదనుగా తెలంగాణ సరిహద్దుల్లో కొత్తగా అనేక బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. బెల్టు షాపుల్లో కూర్చుని మద్యం సేవించడం మరింత సౌకర్యవంతంగా మారడంతో మందుబాబులు రాష్ట్ర సరిహద్దులు దాటి మజా చేస్తున్నట్టు తెలుస్తోంది.
దశల వారీగా మద్యం ఎత్తివేత.. కొన్ని బ్రాండ్లనే అందుబాటులో ఉంచిన ఏపి సర్కార్..
ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లా బోర్డర్ లలో రెండు వైపులా భారీ సంఖ్యలో బెల్ట్ షాపులు వెలిసాయి. రాజకీయా నాయకుల అండతో రెచ్చిపోతున్న లిక్కర్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ బెల్టు షాపులు పెట్టేస్తున్నారు. ఈ బెల్టు షాపుల్లో అన్ని రకాల మందు బ్రాండ్లు అందుబాటులో ఉండడంతో మద్యం ప్రియులు ఏపి సరిహద్దుల నుండి పెద్ద సంఖ్యలో చేరకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో వ్యాపారం బాగానే ఉన్నప్పటికి తమ గ్రామాల్లోకి ఎక్కడ కరోనా వచ్చి చేరుతుందోనన్న ఆందోళన వ్య క్తం చేస్తున్నారు బెల్టు షాపు యజమానులు.
తెలంగాణ సరిహద్దుల్లో బెల్టు షాపులు.. చిత్తుగా తాగి చిందేస్తున్న మద్యం ప్రియులు..
అంతే కాకుండా కృష్ణ జిల్లా, ఖమ్మం బోర్డర్లో ఉన్న అనంతవరం గ్రామంలో పెద్ద ఎత్తున మద్యం వ్యాపారం అక్రమంగా కొనసాగుతోంది. మద్యం తరలింపులో తెలంగాణా సరిహద్దు దాటి ఆంధ్రలోకి వస్తే పోలీసుల కేసులు ఎదుర్కోవాలి కాబట్టి, తెలంగాణ బోర్డర్లోని భూముల్లో కొత్తగా బెల్టు షాపులు ఏర్పాటు చేస్తే, అక్కడే తాగించి సొమ్ము చేసుకోవచ్చనేది అక్రమార్కుల పన్నాగంగా తెలుస్తోంది. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తెలంగాణలోని వ్యవసాయ భూముల్లో కొత్తగా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో పీకలదాకా ప్రయమైన మద్యాన్ని తాగి, ఆ తర్వాత తాపీగా ఏపీలోకి వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది.
మద్యానికి లేవు హద్దులు.. అందుకే రహదారుల పక్కన వెలుస్తున్నాయి బెల్టు షాపులు..
ఇలాంటి కొత్త రకం వ్యాపారంతో ఆంద్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రాంత పంట భూములకు డిమాండ్ పెరిగింది. వ్యవసాయం చేయాల్సిన భూముల్లో బెల్ట్ షాపులు తెరుచుకున్నాయి. సరిహద్దు వెంటే ఉండడంతో ఆంధ్ర నుండి తెలంగాణకు మందుబాబులు క్యూ కడుతున్నారు. నింపాదిగా కూర్చోబెట్టి తాగిస్తుండడంతో అక్కడే తాగి ఊగూతూ ఎంజాయ్ చేస్తున్నారు. మద్యానికి ఉన్న డిమాండ్ని పసిగట్టిన వ్యాపారస్తులు రోడ్డు మార్గం గుండా కాకుండా జల మార్గంలో మద్యం తరలిస్తున్నారు. మద్యం ప్రియులకు కావాల్సిన అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచడంతో పాటు ఏపీ తెలంగాణ సరిహద్దులకు మద్యం ప్రియులు పోటెత్తుతున్నట్టు తెలుస్తోంది.