మద్యం షాపులకు హారతులు: ముగ్గులు..బ్యారికేడ్లు: 40 రోజుల తరువాత..మందుబాబులకు పండగే
అమరావతి: రాష్ట్రంలో మద్యం షాపులు తిరిగి తెరచుకోబోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా రెండు దశల్లో 45 రోజుల పాటు అమలు చేసిన లాక్డౌన్ ఆదివారం నాటితో ముగిసింది. 14 రోజుల మూడోదశ లాక్డౌన్ ఆరంభమైంది. ఈ మూడోదశలో కేంద్రం ప్రభుత్వం కొన్ని సడలింపులను ఇచ్చిన నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మద్యం షాపులు పునఃప్రారంభం కానున్నాయి. ఏపీలోనూ మరి కాస్సేపట్లో మద్యం దుకాణాల తలుపులు తెరవబోతున్నారు.
Recommended Video
ఏపీకి ఎంఫాన్ గండంః దూసుకొస్తున్నతుఫాన్..72 గంటల్లోః దిశ మారొచ్చంటోన్న ఐఎండీ
గ్రీన్జోన్లు, నాన్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రమే..
మూడోదశ లాక్డౌన్ సందర్భంగా గ్రీన్జోన్లు, నాన్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తెరచుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతులను మంజూరు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు లోబడి ఏపీ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ మద్యం దుకాణాలకు వేసిన షట్టర్లను పైకి లేపబోతున్నారు దుకాణాల యజమానులు. ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వాటిని తెరచి ఉంచనున్నారు.
సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి..
మద్యం షాపుల ముందు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్సింగ్ను పాటించాల్సి ఉంటుంది. ఒక్కో దుకాణం ముందు అయిదుమందికి మించిన కొనుగోలుదారులు ఉండకూడదని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. సోషల్ డిస్టెన్సింగ్ను పాటించడానికి వీలుగా ప్రతి దుకాణం ముందు కూడా అయిదు ముగ్గులు పోయాల్సి ఉంటుందని, ఒక్కో ముగ్గు మధ్య ఆరు అడుగుల దూరం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. దీనికి అనుగుణంగా చర్యలను తీసుకుంటున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడానికి అవసరమైన నిబంధనలను ప్రతి షాప్ ముందూ ప్రదర్శించాల్సి ఉంటుంది.
రద్దీ నివారణకు బ్యారికేడ్లు..
కొనుగోలుదారుల తాకిడి అధికంగా ఉంటుందని భావించే ప్రాంతాలు, దుకాణాల వద్ద బ్యారికేడ్లను కట్టారు. కొనుగోలుదారులను నియంత్రించడానికి, సోషల్ డిస్టెన్సింగ్ను పర్యవేక్షించే బాధ్యతను స్థానిక మున్సిపల్ సిబ్బంది, పోలీసులకు అప్పగించారు. కొనుగోలుదారుల తాకిడి తీవ్రంగా ఉండటం, సోషల్ డిస్టెన్సింగ్ను పాటించని దుకాణాలను మూసివేసే అధికారాలను స్థానిక సంస్థల అధికారులకు ఇచ్చారు. మూడోదశ లాక్డౌన్ ముగిసేంత వరకూ మద్యం దుకాణాలను తెరనివ్వకూడదంటూ ఆదేశాలను జారీ చేశారు.
25 శాతం అధికం..
మద్యం రేట్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. మద్యం అమ్మకాలపై ఇప్పటిదాకా కొనసాగిన ధరలను సవరించింది. 25 శాతం పన్నును పెంచింది. ఫలితంగా- అన్ని రకాల మద్యం బ్రాండ్ల రేట్లూ పెరిగినట్టే. పెంచిన రేట్లతోనే మద్యాన్ని విక్రయించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి గ్రీన్జోన్లు, నాన్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తప్పు పడుతోంది.